ఆంధ్రప్రదేశ్‌కి అమరావతికి ఇదే ఆఖరి అవకాశం?

amaravati-constructions-tenders

ఐదేళ్ళ తర్వాత ఆంధ్రాలో ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్ తొలి విడతగా రూ.4,285 కోట్లు విడుదల చేయడంతో త్వరలోనే అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నారు.

అమరావతి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చాలా అవసరం. కనుకనే సిఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఎంత కీలకంగా ఉన్నప్పటికీ కేంద్రం అమరావతికి నిధులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15,000 కోట్లు అప్పు ఇప్పించినప్పటికీ కాదనకుండా తీసుకున్నారు.

ADVERTISEMENT

కానీ అమరావతిని రాష్ట్రంలో ఇతర జిల్లాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కలుపుతూ నిర్మిస్తున్న రైలు, రోడ్ ప్రాజెక్టులకు కేంద్రం వేగంగా అనుమతులు, భారీగా నిధులు అందించేలా ఒప్పించగలిగారు. అలాగే రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. కనుక అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వలేదనే విమర్శలను పట్టించుకోనవసరం లేదు.

గతంలోనే సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని మోడీ చేత భూమిపూజ చేయించారు. తద్వారా అమరావతి నిర్మాణంలో ప్రధాని మోడీకి కూడా బాధ్యత అప్పగించిన్నట్లు భావించవచ్చు. కానీ ఆ తర్వాత అందరికీ తెలిసిన కారణాల వలన ఇన్నేళ్ళుగా అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ పనులు పునః ప్రారంభించబోతున్నారు. మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా పనులు ప్రారంభించడం ద్వారా అమరావతి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నట్లే.

ఈసారి 3 ఏళ్ళలో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకునందున పనుల పురోగతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు, రాజకీయ అవసరాలని బట్టి కేంద్రం నిధులు మంజూరు చేయవచ్చు లేదా అమరావతిలో రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నత విద్యా, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటుకి ప్రధాని మోడీ తోడ్పడవచ్చు.

జగన్‌ ఏ కారణం చేత అమరావతిని పాడు పెట్టినప్పటికీ ఆయన చరిత్రలో నిలిచిపోయే గొప్ప అవకాశం పోగొట్టుకున్నారు. తద్వారా ఆయన అమితంగా ద్వేషించే సిఎం చంద్రబాబు నాయుడుకి ఈ గొప్ప ఆవకాశం కల్పించారు కూడా.

రాబోయే మూడేళ్ళలో కూటమి ప్రభుత్వం అమరావతికి రూపురేఖలు తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే రాష్ట్ర ప్రజలు అది చూసే వచ్చే ఎన్నికలలో మళ్ళీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం.

కానీ గతంలో మళ్ళీ గాలి మేడలు కడుతూ, కూటమి ప్రభుత్వం రాజకీయ తప్పటడుగులు వేస్తే ఇక ఆంధ్రాని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మళ్ళీ జగన్‌ వస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని అమరావతికి ఇదే చివరి అవకాశం అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories