గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలను మరెన్నో ఛీత్కారాలకు, ఇంకెన్నో కుల వివక్షతను ఎదుర్కున్న అమరావతి, నేడు కూటమి రాక తో కొత్త కళను సంతరించుకుంది. రాజధాని అనే పదానికి అర్ధం చెరిపేసి రాక్షసత్వంతో వైసీపీ ఆడిన మూడు ముక్కలాటకు అమరావతి జగన్ నిరంకుశత్వం ముందు బంది అయ్యింది.
కొన్ని తరాల ఏపీ ప్రజల భవిష్యత్ కు బంగారు బాట వెయ్యడానికి గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని మౌన రోదనతో ఎదుర్కున్న అమరావతి నేడు అభివృద్ధి మంత్రం తో వైసీపీ ని భూస్థాపితం చేయబోతుందా.? అవును ఈ ఐదేళ్లలో అమరావతిలో వేసే ఒక్కో అభివృద్ధి పునాది వైసీపీ ని సమాధి చేయడం ఖాయం.
అమరావతి ఒక స్మశానం, అమరావతి ఒక ముంపు ప్రాంతం, అమరావతి ఒక కమ్మ వారి కలల సౌధం, అమరావతి కాదు భ్రమరావతి అంటూ నాడు వైసీపీ చేసిన విష ప్రచారంతో నిత్యం వార్తలలో నిలిచిన అమరావతి నేడు నిర్మాణాలు, నిధులు, అభివృద్ధి అనే సమాచారాలతో వార్తల్లో ఉంటుంది.
అయితే నాడు తాత్కాలికంగా అమరావతి అభివృద్ధిని అడ్డుకోగలిగిన వైసీపీ క్షణికానందాన్ని పొందినప్పటికీ చివరికి రాజధానిని ఇంచు కూడా కదల్చలేకపోయింది. ఈ విషయంలో అంతిమంగా అమరావతినే నెగ్గింది, వైసీపీ ని మట్టి కరిపించింది.
గత ఐదేళ్ల వైసీపీ శాపాలను తొలగించుకుంటూ అమరావతి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పట్టాలెక్కుతోంది. ఇందుకు గాను అటు కేంద్రం నుంచి ఇటు ప్రపంచ బ్యాంకు నుంచి రాజధాని నిర్మాణాలకు, పనుల పునరుద్దరికరణకు నిధులు సమకూరుతున్నాయి. తాజాగా అమరావతి నిర్మాణాలకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 4200 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఇక ఇప్పుడు అమరావతి – హైద్రాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను వెంటనే డిపిఆర్ రూపొందించాలంటూ సంబంధిత శాఖలకు ఉతర్వులు జారీ అయ్యాయి. దీనితో ఇటు ఏపీ రాజధాని అమరావతి టూ తెలంగాణ రాజధాని హైద్రాబాద్ కు రవాణా సౌకర్యాలు సులభతరమవుతాయి. అభివృద్ధి అనేది మౌలిక వసతుల కల్పనతోనే సాధ్యమనేది కాదనలేని సత్యం.
గత ఐదేళ్లు కనీసం జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి వెలగపూడి సచివాలయానికి కూడా రహదారులు సరిచెయ్యని పరిస్థితులను చూసిన స్థానిక ప్రజలు ఇప్పుడు శరవేగంగా మారబోతున్న అమరావతి రూపురేఖలు చూస్తూ ఒక విజనరి పాలనకు ఒక ప్రిజనరికి నాయకత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా అంచనా వేయగలుగుతున్నారు.
అలాగే ఏపీ రాజధాని చుట్టూ ORR , IRR రోడ్ల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం టెండర్ల ను ఆహ్వానించింది. ఇక అమరావతి – హైద్రాబాద్ లను కలుపుతూ నిర్మించబోయే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అమరావతి రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతులు మొదలుకానున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి బాబు ముహూర్తం పెట్టారు. ఆ సుముహూర్తం కోసం అటు రాజధాని అమరావతి తో పాటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇలా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో కూలిన ప్రతి అభివృద్ధి ఇటుకను నేడు కూటమి ప్రభుత్వం తిరిగి పేర్చే పనిలో బిజీగా ఉంది అని చెప్పాలి. కూటమి ప్రభుత్వ హయాంలోనే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ఏపీ ప్రజలకు సుస్థిరమైన, స్థిరమైన రాజధానిని నిర్మించాలని బాబు గట్టి పట్టుదలగా ఉన్నారు. ఆ దిశగానే ఇప్పుడు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.




