భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ఇప్పటి నుండే సిద్ధం చేయాలనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం మెట్రో మ్యాన్ శ్రీధర్ చేత పూర్తి చేయించారు. అలాగే కేంద్రం నుండి అనుమతులు కూడా ఇప్పిస్తామని స్వయంగా వెంకయ్య నాయుడు ఓ ప్రకటన చేసారు. అయితే అంతా సజావుగా త్వరగా జరిగిపోతుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా ప్రాజెక్ట్ విషయాలేవీ బయటకు వెల్లడి కాలేదు.
దీంతో విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అటకెక్కిందన్న వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ఏపీ సర్కార్ కూడా గత రెండు మాసాలుగా పుష్కర పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో కీలక అంశంగా పరిగణిస్తున్న భూసేకరణకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమయ్యే భూముల కోసం తొలి విడతగా 300 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే మెట్రో ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభం కానుంది.



