దశాబ్దాల పాటు అంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కటిగా కలిసి ఉన్నాయి కనుక ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పలువురి ప్రముఖుల విగ్రహాలు రెండు ప్రాంతాలలో ఉన్నాయి.
రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలలో చైతన్యం రగిలించేందుకే ఆంధ్రా పాలకులు, ప్రజల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టక తప్పలేదని, కానీ తెలంగాణ ఏర్పడింది కనుక ఇప్పుడావసరం లేదని నాడు కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు.
కానీ నేటికీ ఆంధ్రా పాలకులను తెలంగాణను దోచుకోవాలని చూస్తున్న దోపీడీదారులుగా, దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగువన ఉన్న తెలంగాణ నీటిని దోచుకుంటున్న రాష్ట్రంగా అభివర్ణిస్తూనే ఉన్నారు.
తన అపూర్వమైన నటనతో ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరినీ దశాబ్దాలపాటు అలరించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు అలాగే సన్నాయి నొక్కులు వినిపిస్తూనే ఉంటాయి.
చివరికి తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని కూడా అంధ్రావాడిగానే చూసి రవీంద్ర భారతిలో అయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పారు.
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పలువురు మాట్లాడారు.
మరి తెలంగాణవాదం పేరుతో వారు ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించమంటూ తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లేఖ వ్రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?
అయన గొప్ప మేధావి, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఎంతగానో కృషి చేశారు కనుక అమరావతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకరించాలని ఆ లేఖలో కోరారు.
వారు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, గద్దర్ లేదా తెలుగు సాహిత్యానికి, కళలకు వన్నె తెచ్చిన ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని కోరవచ్చు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయమని కోరడం గొంతెమ్మ కోరికే కదా? ఇది ఆంద్రా పాలకులను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే దురుదేశ్యంతో వ్రాసినట్లే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




