టెక్నాలజీ… ఇది సిఎం చంద్రబాబు నాయుడు బలమూ, బలహీనత కూడా. ఎప్పటికప్పుడు అందివచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భారీగా ఉద్యోగావకాశాలు కల్పించాలని, వేగంగా రాష్ట్రాభివృద్ధి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు తహతహలాడుతుంటారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ 2026, జనవరి నుంచి ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. ముందుగా అమరావతిలో క్వాంటమ్ టవర్ నిర్మాణంతో దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ భవనానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిని 40,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు.
కానీ సెప్టెంబర్ నుంచి జనవరిలోగా అంటే 3 నెలల్లో ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణం ఎలా సాధ్యం? అంటే త్రీడీ టెక్నాలజీ అంటున్నారు. దీనిలో కొంత భాగాన్ని బహుశః పునాదులు వగైరా సాధారణ పద్దతిలోనే నిర్మిస్తారు. మిగిలిన భాగాన్ని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ప్రింట్ చేసి ముందుగా నిర్మించిన భవనానికి జోడిస్తారు.
అంటే రెడీ మేడ్ గోడలు, స్లాబులు, గదులను 3డీలో ప్రింట్ చేసి ఒకదానితో ఒకటి అతికిస్తూ నిర్మిస్తారన్న మాట! అందువల్లే మూడు నెలల్లోనే ఈ క్వాంటమ్ టవర్ నిర్మాణం పూర్తి కాబోతోంది. ఈ త్రీడీ ప్రింటింగ్ కోసం అవసరమైన కంప్యూటర్లు, యంత్రాలు అన్నీ ఇప్పటికే సిద్దం చేస్తున్నారు.
దీని కోసం ఇప్పటికే డిజైన్ ఖరారు చేశారు. శంకుస్థాపన తర్వాతే డిజైన్ విడుదల చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ భవన నిర్మాణానికి ఒకటి రెండు రోజుల్లో టెండర్లు ఖరారు చేయనున్నారు.




