నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అన్ని ప్రాంతాల నుంచి నేరుగానే కాక త్వరితగతిన చేరుకునేలా అంతర్జాతీయ స్థాయిలో రహదారుల నిర్మాణానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీకి ఓ మూలన… కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న అనంతపురం నుంచి అమరావతి చేరుకోవాలంటే హీనపక్షం 9 గంటలకు పైగా సమయం పడుతుంది. అదే చంద్రబాబు ఆదేశించిన మేరకు రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రయాణ దూరం ఏకంగా 6 గంటలకు తగ్గిపోతుంది.
రోడ్డు వెంట ఒక చిన్న మలుపు గానీ, వంకర గానీ లేకుండా నిర్మించనున్న ఈ రహదారి కోసం భూసేకరణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, భూసేకరణ ముగిసిన వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ రోడ్డు నిర్మాణంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ కూడా మలుపులు లేని రహదారులు లేవు. దీంతో ఈ నిర్మాణం దేశానికే తలమానికంగా నిలవాలని ఆశిస్తున్నారు.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియాగో, లాస్ ఏంజెలిస్, డల్లాస్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లోనే ఇలాంటి రోడ్డున్నాయి. దీంతో వీటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆర్ ఆండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబుతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర అమెరికా బయలుదేరి వెళ్లారు. మలుపులు లేని రోడ్లను పరిశీలించనున్న వీరిద్దరూ వాటి నిర్మాణంలో వాడిన సాంకేతిక పరిజ్ఞానంపై స్థానిక అధికారులతో చర్చలు జరుపుతారు.
ఇక వీరి పర్యటన ముగిసిన తర్వాత ఇంజినీరింగ్ అధికారులను కూడా అమెరికా నుండి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురం – అమరావతి రహదారి తరహాలో అమరావతి – విశాఖ, అమరావతి – రాజమహేంద్రవరం రహదారులను కొత్తగా నిర్మాణం కానున్నట్లు సమాచారం.



