వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనలో పోలీసుల బట్టలూడదీయిస్తాననంటూ చేసిన వ్యాఖ్యలు సరి కాదని, ఆవిదంగా మాట్లాడి వారి ఆత్మస్థైర్యం, మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమించమని కోరుతారని ఎవరూ అనుకోలేదు.
కానీ ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నప్పుడు నష్ట నివారణగా పార్టీలో సీనియర్ నేతలు ఎవరి చేతయినా సంజాయిషీ ఇప్పిస్తారనుకుంటే అదీ లేదు.
పైగా వైసీపీలో నోరున్న నాయకుడుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చేత జగన్ వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.
తెలుగుదేశానికి అనుకూలంగా, చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్న పోలీసులందరికీ తాము అధికారంలోకి రాగానే గుడ్డలు ఊడదీసి బయట నిలబెట్టడం ఖాయమని అంబటి రాంబాబు హెచ్చరించారు. న్యాయం, ధర్మానికి కట్టుబడి పనిచేసే జగన్ పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని అంబటి రాంబాబు హెచ్చరించారు.
జగన్ హయంలో పోలీస్ వ్యవస్థని ఎంతగా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రఘురామకృష్ణ రాజు మొదలు రాజధాని రైతుల వరకు ప్రతీ ఒక్కరిపై జగన్ పోలీస్ వ్యవస్థని ప్రయోగించేవారు.
కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు తదితరులు సంయమనం కోల్పోలేదు. రాజ్యాంగం, చట్ట ప్రకారమే నడుచుకోవాలని లేకుంటే భవిష్యత్లో చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించేవారు.
జగన్, వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఒత్తిళ్ళకు తలొగ్గి చట్ట వ్యతిరేకమైన పనులు చేసినందుకు మాజీ సీఎస్తో సహా పలువురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టులోనే తరచూ మొట్టికాయలు పడుతుండేవని అందరికీ గుర్తుండే ఉంటుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా ఈవిదంగా పోలీసులను బెదిరిస్తుండటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. జగన్ తప్పుగా మాట్లాడితే క్షమాపణలు చెప్పుకుంటే చాలా హుందాగా ఉండేది. కానీ తన తప్పుని ఇంకా సమర్ధించుకోవడం, పోలీసులను ఇంకా బెదిరిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోవడం బలహీనతా.. అతి మంచితనమా?




