రాష్ట్రంలో అత్యధికంగా ఉండే బీసీ ఓటింగ్ కోసం రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ప్రతి ఎన్నికలలో సర్వ సహజంగా జరిగే అంశం. అయితే చిత్తశుద్ధితో చేసిన ప్రకటనలకు అనుగుణంగా కార్యాచరణ చేసే ప్రభుత్వాలు మాత్రం కొద్దే ఉంటాయి. ముఖ్యంగా 2014లో చంద్రబాబు ప్రభుత్వం, 2019లో జగన్ సర్కార్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రజా రాజధానిలో రాజ్యాంగ రచయిత అయిన అంబేద్కర్ విగ్రహం ఉండాలని ప్రతిపాదనలు చేసి, అప్పటికప్పుడు అమరావతిలో దాదాపుగా 20 ఎకరాలలో “స్మృతివనం” పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, అనుకున్నదే తడవుగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
అయితే అవి నిర్మాణ దశలో ఉండగా ఎన్నికలు కావడం, ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడం, అమరావతిని రాజధానిగా పక్కన పెట్టేయడంతో రాజధానిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో గల స్వరాజ్య మైదానంలో (PWD గ్రౌండ్స్) ఏర్పాటు చేస్తానని 2020లో జగన్ భారీ ప్రకటన చేసారు.
ఆ ప్రకటన చేసి ఇప్పటికి ఏడాదిన్నర్ర పూర్తయ్యింది గానీ, ఆ స్టేట్మెంట్ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇటీవల ఓ నలుగురు మంత్రులు మాత్రం అంబేద్కర్ విగ్రహ నమూనాను పరిశీలిస్తున్నామని తెలిపారు. అంటే నమూనాను పరిశీలించడానికి ఒక సంవత్సరం పైనే తీసుకున్నారు. ఏడాదిన్నర్ర కాలంలో ఒక్క ఇటుక కూడా వేయని జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా మహాసేన రాజేష్ ఓ వీడియో చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు.
అధికారంలోకి రాక మునుపు దళితులకు నేను మేనల్లుడిని, దళితులు నా మేనమామలు అంటే తామంతా నమ్మామని, మంచోడు అన్నామని, కానీ ఇపుడు కళ్ళెదురుగా పనులు చేస్తుంటే ఎవరు ఏంటనేది అర్థమవుతోందని ఈ వీడియోలో మహాసేన రాజేష్ వివరించారు. గుర్తుకు వచ్చిన ప్రతి పేరును వదిలిపెట్టకుండా జిల్లాలకు పెట్టిన జగన్ కు అంబేద్కర్ గారి పేరు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు కూడా!



