ఆంధ్రా ప్రజలు బిజెపిని ఆదరించాలని కోరుకొంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాను, ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను ఏనాడూ ఆదరించాలనుకోలేదు. ఆనాడు కాంగ్రెస్ ఆంధ్రా పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, ఇప్పుడు బిజెపి కూడా అదేవిదంగా వ్యవహరిస్తోందని అందరికీ తెలుసు. ఏపీకి భారీగా ఆర్ధికసాయం చేసి ఆదుకొంటున్నామని చెప్పుకొంటుంది. కానీ అది బిజెపి-వైసీపీల మద్య అవగాహనతో ప్రభుత్వ నిర్వహణకు, సంక్షేమ పధకాలకు ఇస్తోంది. కనుక అదంతా ఏట్లో పిసికిన చింతపండులా వృధా అయిపోయిండే తప్ప దాంతో రాష్ట్రాభివృద్ధి కాలేదు.
ఇక ఏపీలో జనసేనతో బహిరంగంగా, వైసీపీతో లోపాయికారిగా స్నేహం చేస్తున్న బిజెపి అధిష్టానం ఆ రెండు పార్టీలతో దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. ఓసారి పవన్ కళ్యాణ్ని అత్యవసరంగా ఢిల్లీ పిలిపించుకొని ఏదో మాట్లాడుతారు. మరోసారి సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారు. ఇంకోసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతూ, ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన ఆంధ్రా రాజకీయాలను ఇంకా కంగాళీ చేస్తున్నారని చెప్పవచ్చు.
జగన్, చంద్రబాబు నాయుడులతో భేటీ తర్వాత అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ ఆంధ్రాలో పర్యటించవలసి ఉంది. ఈ నెల 8న అమిత్ షా విశాఖలో జరిగే బహిరంగసభలో పాల్గొనవలసి ఉండగా అది 11కి వాయిదా పడింది. కనుక జేపీ నడ్డా ఒకరోజు ముందుగా తిరుపతి చేరుకొని అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు.
ఏపీలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలతో చెడుగుడు ఆడుకొంటున్న బిజెపి, 10,11న జరిగే సభలతోనైనా స్పష్టంగా తమ వైఖరి తెలియజేస్తుందని ఆశిద్దాం. లేకుంటే ఆ రెండు పార్టీలను ఎన్నికల వరకు ఇలాగే భ్రమలో ఉంచుతూ రాజకీయంగా దెబ్బ తీయాలని బిజెపి అధిష్టానం ప్రయత్నిస్తోందేమో అని అనుమానించవలసి ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా బిజెపి కోసం ఎదురుచూడటం మానుకొని కలిసి పోటీ చేసేందుకు సిద్దపడితే మంచిదేమో.



