లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయా?

Amit Shah

ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టి రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త అధ్యక్షులని మార్చింది. ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు రాజధాని హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్ నగర్‌ జిల్లాలో పర్యటించి బీజేపీ నేతలు, కార్యకర్తలకు లోక్‌సభ ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ADVERTISEMENT

తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈసారి మరో 8 మందిని గెలిపించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఆ ప్రయత్నంలోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.

ఎన్నికల సమయంలో అగ్రనేతలు రాష్ట్రాలలో పర్యటించడం సర్వసాధారణమే. కానీ లోక్‌సభ ఎన్నికలు ఒక్క తెలంగాణలోనే కాదు ఏపీతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో జరుగబోతున్నాయి కదా?

తెలంగాణలో కేవలం 17 ఎంపీ సీట్లు ఉంటే, ఏపీలో 25 సీట్లు ఉన్నాయి. అయినా బీజేపీ అధిష్టానం ఏపీ వైపు తొంగి చూడటమే లేదు. ఎందుకంటే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎంత ప్రయత్నించినా ఆయాసమే తప్ప గెలవలేదు కనుక. కానీ వైసీపి, టిడిపి, జనసేనలలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ, అవసరమైనప్పుడు అవన్నీ బీజేపీకి మద్దతు ఇస్తాయని తెలుసు కనుకనే.

ఓపక్క వైసీపి, టిడిపి, జనసేనలు తమ అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ, సభలు, సమావేశాలతో దూసుకుపోతుంటే, వాటితో పొత్తుల విషయంలో కూడా ఏపీ బీజేపీకి స్పష్టత ఇవ్వకపోవడంతో ఏవిదంగా ముందుకు సాగాలో తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయింది.

మొన్న ప్రధాని నరేంద్రమోడీ అనంతపురం వచ్చి వెళ్ళారు కానీ అధికారిక పర్యటన కనుక రాజకీయాలు మాట్లాడలేదు. ఏపీ బీజేపీకి ఎటువంటి దిశానిర్దేశం చేయలేదు.

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణని బీజేపీని సిద్దం చేసేందుకు అమిత్ షా తెలంగాణలో పర్యటించడానికి వస్తున్నారు. అంటే బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి ప్రాధాన్యం ఇస్తోంది కానీ ఏపీ బీజేపీ ఇవ్వడం లేదని అర్దమవుతోంది.

ఏపీలో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకున్న నేపధ్యంలో వాటితో చేతులు కలిపి జగన్మోహన్‌ రెడ్డిని, వైసీపిని నిలువరించేందుకు కేంద్రం సహకరించడం మంచిదా లేక టిడిపి, జనసేనలకు దూరంగా ఉంటూ ఒంటరిగా పోటీ చేస్తూ సహకరించడం మంచిదా?అని బీజేపీ అధిష్టానం ఇంకా లెక్కలు కట్టుకుంటున్నట్లుంది.

అయితే జాతీయ రాజకీయ అవసరాల కోసం ఏపీ బీజేపీని బలిపశువుగా చేయకుండా ఉంటే చాలని ఆ పార్టీ ఏపీ నేతలు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories