బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబు నాయుడుపై చేసే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ బీజేపీ సంబంధాలు భారీగా పతనం అయిపోయాయి. టీడీపీ ఎంపీల నిరసనలు విరమింపచేయాల్సిందిగా అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చెయ్యగా సోము వీర్రాజు సంగతి కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారట.
దీనితో ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై భాజపా అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రపక్షంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం నీకెవరు ఇచ్చారని అమిత్ షా నిలదీసినట్టు బీజేపీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిత్రధర్మం, పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఆయనకు చీవాట్లు పెట్టినట్టు సమాచారం.
వ్యక్తిగత అజెండాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇటువంటివి మళ్లీ పునరావృతమైతే కఠినచర్యలకు వెనుకాడబోమని అన్నట్లు సమాచారం. నేతలందరూ పార్టీ నియమాలు పాటించాలని.. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని హెచ్చరించారు. కాగా ఎంపీలు ఆందోళన విడిచిపెట్టే విషయమై చంద్రబాబు అమిత్ షాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.



