ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులకి, ఎమ్మెల్యేలదే పైచేయిగా సాగుతుంటుంది. కానీ వైసీపిలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి హవా నడుస్తుండటం విశేషం. సిఎం జగన్ తర్వాత అంత శక్తివంతుడు గనుకనే వైసీపిలో అందరూ ఆయనకు విధేయంగా ఉంటారని పార్టీని వీడుతునప్పుడు నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటపెట్టిన సంగతి తెలిసిందే.
తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ఎంత శక్తివంతుడో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కూడా అంత శక్తివంతుడని టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆయనపై ఢిల్లీలో అవినీతి కేసులు నమోదయ్యాయని, కానీ ఆ విషయం దాచిపెట్టి టీటీడీ ఈవో పదవి చేపట్టారని అన్నారు. ఇప్పుడు టీటీడీ పదవిని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో కేసుల నుంచి బయటపడేందుకు పైరవీలు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో అవినీతికి పాల్పడిన ధర్మారెడ్డి టీటీడీలో మడి కట్టుకొని కూర్చోంటారా?అటువంటి నేర చరిత ఉన్న వ్యక్తికి ఆనం పరమ పవిత్రమైన టీటీడీ ఈవోగా నియమించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు.
శ్రీవారికి భక్తులు సమర్పించుకొనే నగదు కానుకలలో కొంత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అందజేస్తున్నారని వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బుతో భూమన కుమారుడు అభినవ్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకి వినియోగించుకొంటున్నారని ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
హిందువులు తిరుమలకు వచ్చి శ్రీవారికి నిలువు దోపిడీ ఇచ్చి మొక్కులు చెల్లించుకొంటారని, కానీ భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరూ కలిసి తిరుమలనే నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో, నిత్యం భక్తులు సమర్పిస్తున్న కోట్ల రూపాయలు పక్కదారి పట్టకుండా కాపాడాల్సిన ఛైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి కలిసి శ్రీవారి సొమ్ముని దోచుకోవడం చాలా దారుణమని, టిడిపి అధికారంలోకి వచ్చాక వారిద్దరూ కాజేసిన ప్రతీ పైసాను కక్కిస్తామని ఆనం వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు.




