తన వ్యాఖ్యలలో కాస్తంత ఎటకారాన్ని జోడించి మాట్లాడడం నెల్లూరు జిల్లా నేత ఆనం వివేకానందరెడ్డి స్టైల్. ప్రత్యర్ధులకు మంట పుట్టించే విధంగా ప్రసగించడంలో దిట్ట అయిన ఆనం, ఒకానొక సమయంలో వైసీపీ నేత రోజా గురించి చేసిన ‘జబర్దస్త్’ రోజా అన్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనాత్మక మయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ పై తన వ్యంగ్యాస్త్రాలకు పదును పెట్టారు ఆనం.
“జగన్ కు ఒక పధ్ధతి, విధానం లేకపోవడం వలన ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారని, ఒక్క జగన్ ప్రవర్తన వలనే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని, జగన్ మానసిక స్థితి మెరుగుపడాలని అధికార పక్షం నేతగా తానూ కోరుకుంటున్నానని, జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ కష్ట సాధ్యం” అన్న ఆనం… మరో 10 మంది ఎమ్మెల్యేల దాకా వైసీపీ నుండి బయటకు రానున్నారని అన్నారు.
‘ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, రాష్ట్ర ప్రయత్నాలు ఆపేది లేదని, స్పెషల్ స్టేటస్ అంశంలో ఏ సమయంలోనైనా వెనక్కి తగ్గేది లేదని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని’ అన్నారు. జగన్ ప్రవర్తన గురించి విమర్శలు చేస్తున్న నాయకుల జాబితాలో ఆనం కూడా చేరిపోయాడు మరి!



