‘జబర్దస్త్’ షో బ్యూటీ అనసూయ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ ను కూడా ఓ ఊపు ఊపడానికి “రంగస్థలం” ద్వారా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న అనసూయ, షూటింగ్ లో భాగంగా చిత్ర హీరో రామ్ చరణ్ మరియు దర్శకుడు సుకుమార్ లకు ఓ ప్రామిస్ చేసిందట. ఈ ప్రామిస్ ఏదో వీరోచితమైన విషయానికి సంబంధించి కాదులేండి. తనకు బహుబాగుగా ఓ వంట వచ్చని ఊరిస్తోంది అనసూయ.
తాను కాకరకాయ వంటను బాగా చేస్తానని, దానిని షూటింగ్ స్పాట్ కు చేసుకుని వస్తానని సుకుమార్ మరియు రామ్ చరణ్ లకు ప్రామిస్ చేసానని, తర్వాత షెడ్యూల్ లో ఖచ్చితంగా వారిద్దరికీ తన కాకరకాయ రుచి చూపిస్తానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏ విషయాన్నైనా చెర్రీ చాలా తొందరగా నేర్చేసుకుంటారని, ఓ పిల్లాడిలా ఉత్సుకత చూపుతాడని, చెర్రీ ఉత్సాహం చూస్తే ఆనందం కలుగుతుందని మెగా పవర్ స్టార్ గురించి చెప్పుకొచ్చింది.
“రంగస్థలం” సెట్స్ లో తామంతా ఎక్కువగా ఆహారం మరియు సినిమాల గురించే మాట్లాడుకుంటామని, ప్రస్తుతం వారికిచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ కాకరకాయ కబుర్ల మాకెందుకులే గానీ, “రంగస్థలం” సినిమా ఫస్ట్ టీజర్ ఎప్పుడో చెప్పండి అంటున్నారు మెగా అభిమానులు. అంతేకదా మరి… దసరాకు వస్తుందన్న సినిమా సంక్రాంతి అన్నారు… ఇప్పుడేమో మరలా మార్చి నెలాఖరులో అంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు కదా!


