ఈ ఆకాశం కింద ఉండే ప్రతీ వస్తువు, ఉత్పత్తి, సేవల ధరలు పెరుగుతున్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. కనుక పాలకుల అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అసమర్దత, వైఫల్యాల కారణంగా పెరిగే ధరలను భరించమనడం కూడా తప్పే అవుతుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో చాలా కాలంగా ఇలాగే జరుగుతోంది.
ఎప్పుడో వాడుకున్న విద్యుత్కి ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తుంటే, చేసేదేమీలేక బిల్లుపై ఎంత ముద్రిస్తే అంతా ప్రజలు చెల్లిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అడిగేందుకు, సమాధానం చెప్పేందుకు ఎవరూ ఉండరు కనుక! అడిగినా ప్రయోజనం ఉండదు కనుక!
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దోపిడీకి అడ్డుకట్టవేస్తోంది. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి అదనం వసూలు చేయడం కాదని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నిర్వహణ ఖర్చులకు సరిపడా మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యుత్ బిల్లులలో ట్రూడౌన్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది.
2024-25లో డిస్కంలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.2759 కోట్లు వసూలు చేయగా దానిలో రూ.923.55 కోట్లు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు విద్యుత్ చార్జీల్లో ట్రూడౌన్ చేసి, ఒక్కో యూనిట్ ఛార్జీపై సుమారు 13 పైసలు చొప్పున విద్యుత్ ఛార్జీల భారం తగ్గించబోతోంది.
ప్రజల నుంచి ఎప్పుడూ ఎదో పేరుతో అందినకాడికి పిండుకోవడమే తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు స్వల్పంగానైనా తగ్గబోతున్నాయి. సంతోషమే!




