300 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత దానికి పది రెట్లు అంటే రూ.3,000 ఏపీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్స్ చూస్తున్నవారు ఏదేదో ఊహించేసుకున్నారు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా రాలేదు. వస్తుందో రాదో కూడా తెలీదు!
కానీ ఏపీలో రూ.40,000 కోట్ల భారీ విద్యుత్ స్కామ్ జరిగిందని దాని ముందు 3,000 కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ సముద్రంలో కాకిరెట్ట వంటిదేనంటున్నారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. ఆయన శనివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఈ బాంబు పేల్చారు.
విద్యుత్ తీగలలో ప్రవహిస్తున్న విద్యుత్ ఎవరి కంటికీ కనపడనట్లు గత ప్రభుత్వ హయంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు, సంస్కరణల పేరుతో గుట్టుగా రూ.40,000 కోట్ల భారీ విద్యుత్ స్కామ్ జరిగిందన్నారు.
దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఒకవేళ వాటిని తాను నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్దమేనన్నారు ఏబీ వెంకటేశ్వర రావు.
కనుక ఈ భారీ విద్యుత్ స్కామ్పై సిఎం చంద్రబాబు నాయుడు తక్షణం విచారణకు ఆదేశించి, గత ప్రభుత్వ హయంలో ఓకే చేసిన విద్యుత్ టెండర్లన్నీ రద్దు చేయాలని కోరారు. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటపెట్టి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వ హయంలో అదానీ విద్యుత్ కంపెనీ పేరు వినిపించింది. అమెరికాలో మొదలైన దీని ప్రకంపనలు ఆంధ్రా వరకు విస్తరించాయి. కనుక ఏబీ వెంకటేశ్వర రావు చెపుతున్న 40,000 కోట్ల విద్యుత్ స్కామ్ అదేనా? లేదా విద్యుత్ రంగంలో మిగిలినవన్నీ కలిపి 40,000 కోట్ల స్కామ్ జరిగిందా? అనే విషయం మున్ముందు తెలుస్తుంది.
మద్యం కుంభకోణం జరిగినట్లు తెలిసున్న సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే విచారణ జరిపిస్తున్నారు. అలాగే ఒకవేళ ఏబీ వెంకటేశ్వర రావు చెపుతున్న విద్యుత్ స్కామ్ జరిగి ఉంటే అది తెలియకుండా ఉండదు. కానీ ఇంతకాలం మౌనంగా ఉండిపోయారంటే అర్ధం బహుశః అంతర్గతంగా విచారణ జరిపించి ఎటువంటి స్కామ్ జరగలేదని నిర్ధారించుకొని ఉండాలి.
ఒకవేళ జరిగి ఉంటే దానిని అప్పుడే బయట పెడితే మద్యం కుంభకోణం కేసు విచారణపై ప్రభావం పడి దెబ్బ తింటుందని ఆగి ఉండవచ్చు. లేదా మద్యం కుంభకోణం కేసు మెల్లగా కొలిక్కి వస్తోంది కనుక ఇప్పుడీ కేసుని ముందుగా ఏబీ వెంకటేశ్వర రావు చేత బయట పెట్టించి ఉండవచ్చు. ఒకవేళ ఆయన చెపుతున్నట్లు నిజంగానే ఏపీ ఈ భారీ విద్యుత్ స్కామ్ జరిగి ఉంటే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మెడకి కొత్త సమస్య చుట్టుకున్నట్లే!
లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద కుంభకోణం విద్యుత్ స్కామ్: ఏబీ వెంకటేశ్వరరావు
లిక్కర్ స్కామ్ కేవలం రూ.3 వేల కోట్లే.. విద్యుత్ స్కామ్ రూ.40 వేల కోట్లు
విద్యుత్ రంగం ప్రభుత్వాలకు బంగారు బాతుగా మారింది
విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో… pic.twitter.com/Gc5BAe2fyJ
— BIG TV Breaking News (@bigtvtelugu) September 20, 2025




