2014 ఎన్నికల తరువాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం సుదీర్ఘ సర్వేల ఆధారంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీ సాక్షిగా అటు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మద్దతు, ఇటు అప్పటి మిత్ర పక్షమైన బీజేపీ మద్దతు సాధించి 2015 అక్టోబర్ 22 న ‘ఉద్దండరాయుని పాలెం’ అనే గ్రామంలో ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా రాజధాని శంకుస్థాపనకు భూమి పూజ చేసారు.
2015 ఏడాది చివరిలో మొదలుపెట్టిన ఏపీ రాజధాని నిర్మాణం 2019 ఎన్నికల నాటికి అంటే సుమారు మూడు సంవత్సరాల ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించి, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి,రాజధాని నిర్మాణానికి కావాల్సిన అన్ని అడ్డంకులను తొలగించుకుని నిర్మాణాలకు పునాదులు మొదలుపెట్టారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
అలాగే రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత ప్రజలను ఒప్పించి భూసమీకరణ పద్దతిలో 33 వేల ఎకరాల భూమిని ఎటువంటి బెదిరింపులకు పాల్పడకుండా సమీకరించారు. సమీకరించిన భూమి నుంచే ప్రభుత్వ నిర్మాణాలకు కావాల్సిన వాటా, ప్రభుత్వ రంగ సంస్థలైన విశ్వ విద్యాలయాలు, వైద్య సదుపాయాలకు కొంత వాటా, ఐటీ, టెక్సటైల్ రంగానికి కొంత వాటాను కేటాయించి రోడ్లు, ఇతర సదుపాయాలను సిద్ధం చేసారు.
ఇలా రాజధాని ప్రాంతాన్ని ఒక పక్కా ప్రణాళిక పద్దతిలో అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి చేసిన ప్రాంతంలో రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు అందులో వాటాను కల్పించి రాజధాని నిర్మాణానికి అడుగులు ముందుకు వేశారు బాబు. ఇలా ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి సుమారుగా ఒక ఏడాది సమయం తీసుకున్న టీడీపీ ప్రభుత్వం ఇక తనకు మిగిలిన ఉన్న రెండేళ్ల సమయాన్ని అటు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి వినియోగించింది.
టీడీపీ ప్రభుత్వానికి మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్ట్ వంటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రభుత్వ రంగ భవనాల నిర్మాణాలు, పేదలకు ఎన్టీఆర్ కాలనీ పేరు మీద కొన్ని వందల ఇళ్ల నిర్మాణాలను 90 శాతం పూర్తి చేసింది అప్పటి ప్రభుత్వం.
ఇంత ప్రక్రియ పూర్తి చేయడానికి చంద్రబాబు ప్రభుత్వానికి మూడేళ్ళ సమయం పడితే జగన్ అధికారంలోకి వచ్చి క్షణ కాలంలో తీసుకున్న ఒకేఒక్క నిర్ణయం ఏపీ భవిష్యత్తుని తలక్రిందులు చేసింది. 2019 ఎన్నికల తరువాత ఏపీ ప్రజలు మేము ప్రభుత్వాన్ని మాత్రమే మార్చాము అనుకునేలోపే తమ తలరాతలు మారిపోయాయి అని గ్రహించలేకపోయారు. “ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు” అంటూ ముందుకెళ్లిన జగన్ సర్కార్ ఒక్క అడుగు ముందుకు వేయలేక పోయింది కానీ ఏపీ భవిష్యత్తు ని మాత్రం వంద అడుగుల పాతాళానికి పడేసింది.
ఇలా జగన్ సర్కార్ “అమరావతి టూ విశాఖ పట్నం” వెళ్లాలని 2019 లో మొదలుపెట్టిన యాత్ర 2024 ఎన్నికల సమయానికి కూడా పూర్తి చేయలేకపోయారు. టీడీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి మిగిలిన రెండేళ్ల కాలంలోనే రాజధానిని పూర్తి చేయలేకపోయారు అని విమర్శించిన సోకాల్డ్ మేధావులు, అప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు ఏపీ ప్రజలకు రాజధాని ఎక్కడో చెప్పగలిగారా..? అమరావతి నుంచి ఒక్కఅడుగు ముందుకు వేయలేకపోయారు, అలాగే అమరావతిలో ఒక్క ఇటుక పేర్చలేకపోయారు.
అధికారం కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ కు ‘అమరావతి టూ వైజాగ్’ 400 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఐదేళ్ల సమయం పట్టడం, ఆ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి, మరో ఐదేళ్ల సమయం కావాలని జగన్ సర్కారు అడగడం వారి అత్యాశే అవుతుంది. అలాగే ప్రజలు కూడా మరోసారి మోసపోవడానికి సిద్దపడి ఇటువంటి వారికీ మరో ఛాన్స్ ఇస్తే మాత్రం అది వారి అమాయకత్వమే అవుతుంది.






