అంబటి పాదయాత్ర….కులం కాపు కాస్తుందా.?

Ambati Rambabu Padayatra Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటి రాంబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టిలో కాపు టైగర్ అయిపోయారు. అయితే అధినేత నుంచి అనుకోకుండా వచ్చిన ఈ అవార్డు ను కాపాడనుకోవడానికి, తన బూతు రాజకీయానికి దక్కిన గుర్తింపుకు కృతజ్ఞత చూపేందుకు అంబటి రాంబాబు కుల రాజకీయాలకు సిద్దమయ్యారా.?

అందులో భాగంగానే అంబటి రాంబాబు తన ఇంటి మీద జరిగిన దాడి ని అడ్డుపెట్టుకుని పాదయాత్రకు సిద్దమవుతున్నారా.? అంటే అంబటి తాజా ప్రకటనలు చూస్తే అవుననే అనిపిస్తుంది. త్వరలో తానూ తన ఇంటి దగ్గర నుంచి మంగళగిరి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు.

ADVERTISEMENT

అయితే గతంలో వైఎస్ జగన్ పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ వైసీపీ ప్రభుత్వం పట్టాభిని అరెస్టు చేసి జైలుకు పంపింది, ఇక వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద గుండాల మాదిరి దాడులతో తెగబడి అడ్డొచ్చోనోళ్ల తలలు పగలు కొట్టారు.

అయితే ఇదంతా వైసీపీ క్యాడర్ కి తన పై ఉన్న ప్రేమ, గౌరవం అని, తనని తిడితే తన పార్టీ శ్రేణులకు బీపీలు రావా అంటూ సాక్ష్యాత్తు సీఎం హోదాలో ఉన్న జగన్ ప్రకటించారు, అలాగే ఆ ప్రకటనను పార్టీ నేతలు, మంత్రులుగా ఉన్న నాయకులు సమర్ధించారు.

కానీ నేడు అదే బీపీలు టీడీపీ శ్రేణులకోసే దాన్ని కుల రాజకీయంగా మళ్లిస్తున్నారు వైసీపీ నేతలు. కాపు కులం మీద కమ్మ ఆధిపత్యం అని కొందరు, కాపు కులం మీద బాబు దాడి అంటూ మరికొందరు తమ తప్పుకి కులం అనే ముసుగు తొడుగుతున్నారు, ఆ కుల రాజకీయాలు అనే గొడుగు కింద చలి కాసుకోవాలని చూస్తున్నారు.

2029 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఈసారి కాపు సామాజికవర్గంలో చీలిక కోసం అంబటి రాంబాబు వివాదానికి వెలుగులో ఉంచేందుకు ఎప్పటికప్పుడు ఏదొక కార్యక్రమంతో నిప్పు రాజేయాలని భావిస్తుందా.? దాని ఫలితంగా ఎలా అయినా కాపు సామాజికవర్గ ఓట్లను కూటమి కి దూరం చేసి జగన్ 2.0 కలను సాకారం చేసుకోవడానికి వైసీపీ సిద్ధమయ్యిందా.? మరి పవన్ ని కాదని అంబటి పాదయాత్ర వైసీపీ కి కాపు కాస్తుందా లేదా అనేది కాలమే బదులు చెప్పగలదు.

ADVERTISEMENT
Latest Stories