“పుష్ప 2” ప్రీమియర్స్ టైంలో జరిగిన ఘటన ఆ తర్వాత అల్లు అర్జున్ విషయంలో జరిగిన హడావుడి అందరికీ తెలిసిందే. ఈమధ్యే అల్లు అరవింద్, స్నేహా రెడ్డి ఆ ఘటన కారణంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీతేజ్ ను పలకరించారు. ఈ కేస్ విషయంలో మీడియా రకరకాల వార్తలు పబ్లిష్ చేసింది. వింతైన స్పెషల్ స్టోరీస్ కూడా రన్ చేసింది. అయితే.. ఇకపై మాత్రం ఈ కేసు విషయంలో ఎలాంటి వార్తలు ఉండబోవు.
అందుకు కారణం.. అల్లు అర్జున్ & టీమ్ ఈ కేస్ విషయంలో ఆధారం లేని ఎలాంటి వార్తలు/కథనాలు ప్రచురించకూడదు అని ఆర్డర్ జారీ చేయించుకుంది. సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి గారు 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.
దాంతో అల్లు అర్జున్ కి ఈ సంధ్య థియేటర్ కేస్ విషయంలో ఇబ్బంది కాస్త దూరమైనట్లే. ఈ ఉత్తరువులు సోషల్ మీడియా కూడా పాటించాల్సి ఉంటుంది కాబట్టి నెగిటివ్ కామెంట్లు, పోస్టుల విషయంలో బన్నీ టీమ్ కాపీ రైట్స్ లేదా టేక్ డౌన్ చేసే వెసులుబాటు ఉంటుంది.






