బదిలీలు చేసేశాం… జీతాలప్పుడే కాదు!

ఏపీ విద్యావ్యవస్థలో సంస్కరణల పేరుతో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళుహా ఉపాధ్యాయులను ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. తాజాగా బదిలీలతో వారిని కన్నీళ్ళు పెట్టిస్తోంది. మూడు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి నేటి వరకు మూడు నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదు. ఏమంటే ‘టెక్నికల్ ప్రాబ్లెమ్’ అని చెపుతున్నారు.

జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు వేర్వేరు. కనుక వాటిలో పనిచేసే ఉపాధ్యాయులను ఒక దాని పరిధిలో నుంచి మరో పరిధిలోని పాఠశాలలకు బదిలీలు చేసేటప్పుడు, సంబందిత విభాగాల సాఫ్ట్‌వేర్‌లో ఆ మార్పులు నమోదు చేసి, బదిలీ అయిన స్థానానికి ఆర్ధికశాఖ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఉపాధ్యాయులకు జీతాలు విడుదలవుతాయి.

ADVERTISEMENT

కానీ సంస్కరణల పేరుతో అంతా గందరగోళంగా మారడంతో కంప్యూటర్లలో ఈ ప్రక్రియని పూర్తిచేయకుండానే ఉపాధ్యాయులను బదిలీలు చేసి విద్యాశాఖ చేతులు దులిపేసుకొంది. దీంతో మూడు నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు.

నేడు సెప్టెంబర్‌ 2వ తేదీ. ఈపాటికి ఉపాధ్యాయుల ఖాతాలలో జీతాలు పడిపోవాలి. కానీ ఆర్ధికశాఖకు చెందిన సిఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లోనే ఇంతవరకు జీతాలు పడలేదని చూపిస్తోంది. మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు చూస్తున్న ఉపాధ్యాయులు పదేపదే సిఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి దానిలో రెగ్యులర్ పే రోల్ బిల్లులో తమ జీతాలు పడ్డాయా లేదా అని చూసుకొంటున్నారు. కానీ నేటికీ అది ‘అనేబుల్’ అనే చూపిస్తుండటంతో తీవ్ర నిరాశతో క్రుంగిపోతున్నారు.

జీతాలు చెల్లించకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జీతాలు పడినా పడకపోయినా గృహ, వాహన రుణాల వాయిదాలు మాత్రం టంచనుగా చెల్లించాల్సిందే. లేకపోతే జరిమానాలు, వడ్డీలు తప్పవు. మూడు నెలలుగా జీతాలు పడకపోవడంతో ఉపాధ్యాయులు ఇంతకాలంగా పొదుపు చేసి దాచుకొన్న మొత్తాలన్నిటినీ బయటకు తీసి నెట్టుకొస్తున్నారు.

కానీ ఈ నెల కూడా ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించకపోతే రోడ్డున పడతామని బదిలీ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు కానీ మిగిలిన ఉపాధ్యాయులకు కూడా ఇంతవరకు జీతాలు పడలేదు. వారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోక ఏదో ఒక నెల జీతాలు ఆలస్యమైన సర్ధుకుపోగలము కానీ నెలనెలా ఆలస్యంగా చెల్లించడం ఆనవాయితీగా మార్చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సకాలంలో జీతాలు చెల్లించకపోయినా, ఇచ్చిన హామీలను అమలుచేయకపోయినా, ప్రభుత్వం నానాటికీ తమపై పని ఒత్తిడి పెంచేస్తోందని, ఇటువంటి పరిస్థితులలో ఉత్తమ ఫలితాలు ఏవిదంగా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వంలో వారి మొర వినేదెవరు?

ADVERTISEMENT
Latest Stories