వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ ఒక్కో ఎన్నికలకు ఒక్కో నినాదం అన్నట్టుగా రాజకీయం చేస్తుంది. నాటి 2014 నుంచి నేటి 2024 ఎన్నికల వరకు వైసీపీ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ సాధనే మా లక్ష్యం అంటూ ఒకసారి బరిలోకి దిగితే మరోసారి ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ ప్రజల ముందుకొచ్చింది.
అయితే ఇక ఏపీలో రాబోయే ఎన్నికల కోసం వైసీపీ ఈసారి ‘కుల రాజకీయాలను’ తెరమీదకు తెచ్చేందుకు సిద్దమయినట్టు ఇప్పటికే అనేక స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. అంబటి అరెస్టు నుంచి సాయి కృష్ణ మిస్సింగ్ వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశం ను వైసీపీ కుల రాజకీయాల ప్రాతిపదిక మీద నడిపించాలని చూస్తుంది.
ఇందుకు పునాదులు వేసేందుకు గాను వైసీపీ కాపు నేతలందరూ కలిసి కాపు సామాజికవర్గాన్ని పవన్ కి వ్యతిరేకంగా మార్చి, కూటమికి దూరం చేసి వైసీపీ కి దగ్గర చేసేందుకు గాను కుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే “కూటమి ఓటమి వరకు…కాపులం..కలిసినడుస్తున్నాం, కదులుతున్నాం, కథం తొక్కుతున్నాం” అంటూ వైసీపీ కాపు నేత అంబటి రాంబాబు తన X లో పోస్ట్ పెట్టారు.
అలాగే కోనసీమ జిల్లా వెంకటాయపాలెం లో జరిగిన వైసీపీ కాపు నేతల సమ్మేళనం లో బొత్సా మొదలుకుని అంబటి, పేర్ని, వంగా గీత, తోట త్రిమూర్తులు….వరకు ఇలా అందరు పవన్ టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టారు. తనను ఒక కులాన్ని పరిమిత చెయ్యొద్దని, జనసేన చుట్టూ కాపు కులాన్ని కంచెగా వెయ్యొద్దని పవన్ పదేపదే హెచ్చరిస్తున్నా వైసీపీ మాత్రం పవన్ మీద కాపు నాయకుడి ముద్ర పడేలా చెయ్యడానికి ప్రణాళికలు వేస్తూనే ఉంది.
ఒక్క సారి కాపు నాయకుడిగా పవన్ ను చిత్రీకరించగలిగితే ఇక పవన్ ను ఆయన పార్టీ జనసేన ను ఒక్క సామాజికవర్గానికే పరిమితం చేసేయొచ్చని, తద్వారా కాపు సామాజికవర్గాన్ని రెచ్చకొట్టి పవన్ ను రాజకీయంగా దెబ్బతీయొచ్చని వైసీపీ రాజకీయ ఎత్తులు వేస్తుంది.
అయితే నిజంగా వైసీపీ చేస్తున్న ఈ కుల రాజకీయ ఉచ్చులోకి కాపు సామాజికవర్గం చిక్కుకుంటుందా.? పవన్ ను కాదని, కూటమి ని వదులుకుని రెడ్డి నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు కాపు సామాజికవర్గం ఓటర్లు వైసీపీ నేతలతో కలిసి నడుస్తారా.? ఒక్కటిగా కదులుతారా .? కథం తొక్కుతారా.?
అంబటి వివాదం, సాయికృష్ణ అంశంలో వైసీపీ చేసిన కుల రాజకీయాలకు కాపు సామాజికవర్గం మద్దతు దక్కిందా.? YCP భావిస్తున్నట్టుగా ఆ సామాజికవర్గం కూటమి కాదని వైసీపీ వైవు కలిసి నడిసేందుకు సిద్ధమయ్యిందా.? నాడు ముద్రగడ సాధించలేనిది నేడు వైసీపీ అంబటి, పేర్ని, తోటా, బొత్స తో సాధించగలుగుతుందా.?




