‘ఇది మంచి ప్రభుత్వం’ అని నిరూపించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆదాయం, తెల్ల రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కార్పోరేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ పధకం ద్వారా వైద్య చికిత్సలు అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు వారందరూ రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు పొందవచ్చు.
కానీ తెల్ల రేషన్ కార్డులు రాష్ట్రంలో అందరికీ లభించవు. కనుక మధ్య తరగతి, ఎగువ మద్య తరగతిలో సరైన ఆదాయం లేక వైద్యం… కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించుకోలేక అనేక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నవారు లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం నిర్ణయం చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయంతో సంబంధం లేకుండా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు పొందవచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య భీమా పధకాలను కలిపి హైబ్రీడ్ విధానంలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ ఆరోగ్య భీమా పధకం అమలు చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో సర్వేలు జరిపించి ప్రజలందరి ఆరోగ్య వివరాలు సేకరించి హెల్త్ డాటా తయారుచేసి సిద్దంగా ఉంచారు. సచివాలయాల ద్వారా ఆన్లైన్లో హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తున్నారు.
కనుక భీమా కంపెనీలతో ఒప్పందాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పధకాలని కలిపి హైబ్రీడ్ విధి విధానాలు రూపొందించడం, శాసనసభలో దీని కోసం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం వంటి రాష్ట్ర ప్రభుత్వం తరపున జరగాల్సిన అధికారిక ప్రక్రియలన్నీ పూర్తయితే రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. మరొక రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకం ప్రారంభించే అవకాశం ఉంది.




