ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని వెనుక ఆయనకు వేరే రాజకీయ ఆలోచనలు, కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ అందుకు ఆయనే నవ్వుల పాలయ్యారు. అది వేరే సంగతి.
ఆ తర్వాత అయన బల ప్రదర్శన యాత్రలు… వాటిలో రప్పారప్పాలప్పుడు నిజంగానే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తినట్లు కనిపించినా కూటమి ప్రభుత్వం చాలా త్వరగానే పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించగలిగింది.
అయితే ఇటీవల గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో వైసీపీ అధినేత జగన్ నిలదీస్తుంటే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుని సస్పెండ్ చేయడం, ఆయనపై కేసు నమోదు చేయడం, జాతీయ మానవ హక్కుల కమీషన్లో వైసీపీ నేతల పిర్యాదు వంటివన్నీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
ఏ రాష్ట్రంలోనైనా కొందరు అధికారుల అత్యుత్సాహం వలన ప్రభుత్వాలకు ఇటువంటి ఇబ్బందులు తప్పవు. కనుక ఇదీ అటువంటిదేనని లైట్ తీసుకోవడం మంచిది కాదు.
సమస్యలు, సవాళ్ళలో అవకాశాలు వెతుక్కోవాలని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. ప్రతీ విషయంలో ఆయనతో విభేదించే వైసీపీ ఈ ఒక్క విషయంలో ఏకీభవిస్తుంది.
రాష్ట్రంలో ఏర్పడిన ఇలాంటి సమస్యలలో రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ కూటమి ప్రభుత్వంపై పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుంటుంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో వైసీపీకి అవకాశం లభిస్తే పచ్చటి తీగలా అల్లుకుపోగల నేర్పుంది.
అనేక విపరీత రాజకీయ పరిణామాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తున్నాయి. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధిపనులు సాగుతున్నాయి. ఇవి ఇలాగే సాగాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా కీలకం. కనుక ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.




