2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కనీసం గ్రావిటీ ద్వారా నీరందించాలని ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీలా ట్రైబ్యునల్ ముందు దివాలా పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ సంస్థ తమకు 725 కోట్లు బకాయి పడిందని, వెంటనే కార్పొరేట్ ఇన్ సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టి తమ బకాయిలు ఇప్పించాలని కోరింది.
తమకు డిసెంబర్ 22 నాటికి 489 కోట్లు చెల్లించాల్సి వుందని, ఆ మొత్తం కట్టడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగించేలా కెనరా బ్యాంకు తీసుకున్న ఈ చర్యతో ఏపీ ప్రభుత్వం సైతం డోలాయమానంలో పడింది. ఒకవేళ నేషనల్ లా ట్రైబ్యునల్, ట్రాన్స్ ట్రాయ్ ని దివాలా తీసిన సంస్థగా ప్రకటిస్తే, పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిచే ప్రమాదం ఉంది, మళ్ళీ తిరిగి కాంట్రాక్టులను పిలవాల్సిందే.
ట్రాన్స్ ట్రాయ్ కి మరే బ్యాంకు నుంచి అప్పు పుట్టదు. ప్రాజెక్టుకు కీలకమైన కాంక్రీటు పనులు క్లిష్టతరమవుతాయి. స్లిప్ వే, స్పిల్ చానల్ పనులు సాగవు. అయితే, ఈ పరిస్థితిని చంద్రబాబునాయుడు ముందే గ్రహించి, కొత్త టెండర్లను పిలిచారని, అయితే, కేంద్ర జలవనరుల శాఖ అడ్డు పడి, ఆ ప్రక్రియను నిలిపేసిందని ఏపీ అధికారులు అంటున్నారు. వాస్తవానికి తదుపరి వర్షాకాల సీజన్ లో గోదావరికి వరదలు వచ్చే సరికి స్పిల్ వేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, అదిప్పుడు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
మరోవైపు ఎలాగైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేసే వరకు తాను నిద్రపోనంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భావోద్వేగంతో మాట్లాడారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దుర్గాఘాట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు… బిల్లులు సకాలంలో చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలనేది తన ఆలోచనని, ఈ నిర్మాణం పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని మరోమారు స్పష్టం చేశారు.



