నా అక్కాచెల్లెళ్లను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం అంటూ ఉదరగొట్టు ప్రసంగాలు చేసే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని వేలమంది అక్కచెల్లమ్మల నోటికాడి కూడు లాగుతున్నారని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
తమకు పనికి తగ్గ వేతనం చెల్లించాలంటూ, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ప్రభుత్వం పై సమ్మె కు దిగిన అంగన్వాడీల పై కన్నెర్రచేసింది వైసీపీ ప్రభుత్వం. ఛలో విజయవాడ అంటూ అంగన్వాడీ సంఘాలు ఇచ్చిన పిలుపుతో పోరుబాట పట్టిన అంగన్వాడీ ఉద్యోగులను, ఆయాలను ఎక్కడికక్కడ నిర్బంధించారు పోలీస్ అధికారులు.
విజయనగరం, బాపట్ల, విశాఖపట్నం,పల్నాడు,తిరుపతి, నంద్యాల, ప్రకాశం జిల్లాల నుండి ఛలో విజయవాడకు బయలుదేరిన కార్యకర్తలను, సంఘాల ప్రతినిదులు, ఆయాలను అదుపులోకి తీసుకుని అంగన్వాడీల కార్యక్రమాన్ని భగ్నం చేస్తున్నారు అధికారులు. నిన్న అర్ధరాత్రి విజయవాడ చేరుకున్న పలువురు అంగన్వాడీ ఉద్యోగులను ధర్నా చౌక్ వద్ద లైట్లు ఆపి మరి బలవంతపు అరెస్టులు చేసారు.
అలాగే తాడేపల్లి సీఎం జగన్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఉద్యోగులను కూడా మహిళా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. ఇప్పటికే సమ్మె బాట పట్టిన ఉద్యోగుల పై ‘ఎస్మా చట్టాన్ని’ ప్రయోగించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు విధులలోకి హాజరు కానీ అంగన్వాడీ ఉద్యోగులను విధుల నుండి తప్పించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
దీనితో ఇదేనా జగనన్న అక్కచెల్లమ్మలకు ఇచ్చే భరోసా..? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి మా మీదా మీ ప్రభుత్వ జులుం..,మా ఉపాధిని అడ్డుకుంటూ మా కుటుంబాలను రోడ్డు మీదకు లాగడమేనా వైసీపీ సర్కారు ధ్యేయం అంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు నిరసనకారులు. ఎన్నికలకు రెండు నెలల ముందు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు తిరిగి విధులలోకి హాజరయ్యి వెనకడుగు వేస్తారా..? లేక ప్రభుత్వాన్నే వెనకడుగు వేపిస్తారా అనేది తేలాల్సి ఉంది.




