నెల్లూరులో వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, కాకణి గోవర్దన్ రెడ్డి మద్య గొడవలు అందరికీ తెలిసినవే. జగన్ క్యాబినెట్లో మొదటి రెండేళ్ళు మంత్రిగా ఓ వెలుగు వెలిగి నెల్లూరులో చక్రం తిప్పారు అనిల్ కుమార్ యాదవ్. అప్పుడు నెల్లూరుకే చెందిన వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ‘తన టర్న్’ కోసం ఓపికగా ఎదురుచూస్తుండిపోయారు.
రెండేళ్ళ తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన చేసి అనిల్ కుమార్ని బయటకి పంపించేసి, కాకణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంతో ఒక్కసారిగా నెల్లూరులో సీన్ రివర్స్ అయ్యింది. అంతవరకు తన వెంట తిరిగినవారందరూ ఒకరొకరిగా తనని విడిచిపెట్టి వెళ్లిపోయారని ఈ మద్యనే అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు నెల్లూరులో కాకాణి హవా నడుస్తుండటంతో అనిల్ కుమార్కి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అలాగని తాను చేతులు కట్టుకొని కూర్చోంటే కాకాణి తన టికెట్కి కూడా ఎసరుపెట్టేసే ప్రమాదం ఉందని అనిల్ కుమార్ గ్రహించిన్నట్లున్నారు. అందుకే నెల్లూరుపై పట్టు సాధించేందుకు మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విదించింది కనుక ఇకపై నెల్లూరు పట్టణంలో ఎక్కడా ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడానికి వీల్లేదని అనిల్ కుమార్ మున్సిపల్ అధికారులకి హుకుం జారీ చేసిన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎక్కడైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు కనిపిస్తే వాటిని తానే చించేస్తానని, అవి సొంత పార్టీవైనా, ప్రతిపక్షాలవైనా సరే… అంటూ అధికారులని హెచ్చరించిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని గౌరవించడం, పాటించడం అవసరమని, కనుక ఇకపై నెల్లూరు పట్టణంలో ఎవరూ ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టకుండా అడ్డుకోవాలని అనిల్ కుమార్ అధికారులకి సూచించిన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిషేదం ప్రతిపక్షాల కోసమా లేక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరుల కోసమేనా?ఒకవేళ మంత్రి కాకాణి వర్గీయులు పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్లని తొలగిస్తే ఆయనకి కోపం వస్తుంది. తొలగించకపోతే అనిల్ కుమార్కి కోపం వస్తుంది. మరేలా అని తలలు పట్టుకొంటున్నారు నెల్లూరు మున్సిపల్ అధికారులు.





