దమ్ముంటే టిడిపి ఒంటరిగా పోటీ చేయాలని సిఎం జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు సవాళ్ళు విసురుతుంటారు. దమ్ముంటే 175 సీట్లకు పోటీ చేస్తున్నామని చెప్పాలని సవాలు చేస్తుంటారు. దమ్ముంటే నా నియోజకవర్గంలో పోటీ చేసి నన్ను ఓడించండి అని సవాలు చేస్తుంటారు.
వైసీపీ నేతల ఈ సవాళ్ళు చూస్తుంటే తాము కోరుకొంటున్నట్లే ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని ఆశిస్తున్నట్లనిపిస్తుంది. అలాగని టిడిపి ఏదైనా నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించగానే వారిలో కంగారు మొదలైపోతుంది. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప టిడిపి ఒంటరిగా వచ్చినా భయపడుతుంటారని అర్దమవుతుంది.
నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్ధిగా మాజీ మంత్రి నారాయణ పేరు ఖరారు అయిన్నట్లు తెలియగానే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెంటనే ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటమే ఇందుకు చక్కటి ఉదాహరణ.
నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణకు టిడిపి టికెట్ ఖరారు చేస్తే ముందుగా ఆయన అనుచరులో లేదా స్థానిక టిడిపి కార్యకర్తలు హడావుడి చేయాలి. కానీ వారికంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్మీట్ పెట్టి నారాయణపై నిప్పులు చెరగడం విశేషం.
వచ్చే ఎన్నికలలో తనను ఓడించేందుకు ఆయన రూ.150 కోట్లు ఖర్చు చేయబోతున్నారని కూడా జోస్యం చెప్పారు. బహుశః ఈ విషయం టిడిపి నేతలకు కూడా ఇంకా తెలిసి ఉండకపోవచ్చు.
తనకు జగన్ టికెట్ ఇవ్వకపోతే ఓడిపోయిన్నట్లు భావిస్తాను కానీ నారాయణ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా తనను ఓడించలేరని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నారా లోకేష్ను నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయమని తాను సవాలు విసిరితే భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు.
నెల్లూరు నుంచి నారాయణ పోటీ చేయబోతున్నారని తెలియగానే హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి మాట్లాడినప్పుడే అనిల్ యాదవ్ ఓటమిని అంగీకరించిన్నట్లు భావించవచ్చు. ఆయనని ఎదుర్కొనేందుకే భయపడుతున్న అనిల్, నారా లోకేష్ని ఎదుర్కోగలరా?ఎదుర్కొన్నా గెలవగలరా?అయినా వైసీపీ నేతలు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే ప్రతిపక్షాలు పోటీ చేస్తాయా?
కుప్పంలో చంద్రబాబు నాయుడుని, టెక్కలిలో అచ్చన్నాయుడుని ఓడించేందుకు వైసీపీ దాదాపు రెండేళ్ళ నుంచే సన్నాహాలు ప్రారంభించడం గమనిస్తే టిడిపి నేతలను ఎదుర్కోవడం అంత సులువు కాదని వైసీపీ అంగీకరించినట్లేగా?
గత ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఆయన మాటలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో వైసీపీ నేతలందరూ ఆ ప్రభంజనంలో గెలిచేశారు. కానీ రాష్ట్ర ప్రజలు తమ వైసీపీ పాలన పూర్తిగా రుచి చూశారు కనుక ఈసారి ఎదురీత తప్పదని వైసీపీలో అందరికీ తెలిసే ఉంటుంది.
అయినా ఎన్నికలో పోటీ చేయడానికి జగనన్న టికెట్ ఇస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్, ఈ సవాళ్ళు ప్రగల్భాలు పలకడం దేనికి?ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అవసరమా?



