గమనిక: నేను పార్టీ మారడం లేదు ఇట్లు అనిల్‌ కుమార్‌ యాదవ్‌!

YSRCP_Nellore_Anil_Kumar_Yadavగత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ అన్ని స్థానాలు గెలుచుకోవడంతో కడప తర్వాత నెల్లూరు వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే నాలుగేళ్ళలోనే ఆ కోట బీటలు వారింది. జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను మంత్రివర్గంలో తొలగించి జిల్లాకే చెందిన కాకణి గోవర్ధన్ రెడ్డి నియమించడంతో వారిద్దరి మద్య విభేధాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT

దశాబ్ధాలుగా వైఎస్ కుటుంబానికి, పార్టీకి వీరవిధేయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటువేసి ఒకేసారి బయటకు పంపించేయడంతో నెల్లూరు వైసీపీ కోటకు బీటలు పెరిగాయి. వారు ముగ్గురూ టిడిపిలో చేరుతుండటంతో వచ్చే ఎన్నికలలో ఆ మూడు సీట్లు టిడిపి ఖాతాలో పడటం ఖరారైపోయింది.

ఇక అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆయన బాబాయ్, నగర మేయర్ రూప్ కుమార్‌ యాదవ్‌తో గత ఏడాదిగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి వర్గంపై మరొకరు దాడులు చేసుకోవడం, ఇద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యాలయాలు పెట్టుకొని, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది.

నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాద్‌తో కూడా అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు పొసగడం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఈసారి టికెట్‌ కోసం పోటీ పడుతుండటమే.

పార్టీలో ఎవరితో ఇమడలేకపోతున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ త్వరలో పార్టీ వీడబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గడప గడపకి కార్యక్రమంపై ఇటీవల సిఎం జగన్‌ నిర్వహించిన సమావేశానికి అనిల్‌ హాజరుకాకపోవడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరింది.

అయితే శుక్రవారం సాయంత్రం నెల్లూరులో ఎంసీఎస్ కళ్యాణమండపంలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, రూప్ కుమార్‌ యాదవ్‌, ముక్కాల ద్వారకానాద్‌లపై నిప్పులు చెరిగారు.

“నేను నెలరోజులు ఊళ్ళో లేకపోయేసరికి నా కుర్చీ కిందే మంటపెట్టేందుకు సిద్దమైపోయారు. నేను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. ఏదో విదంగా నన్ను బయటకు పంపించి టికెట్‌ సంపాదించుకోవాలని వారి తాపత్రయం. అయితే నేనెక్కడికి వెళ్లిపోవడం లేదు. ఇక్కడే నెల్లూరులోనే వైసీపీలోనే ఉంటాను. జగనన్న పొమ్మంటే తప్ప తుదిశ్వాస వరకు పార్టీలోనే ఉంటాను.

వచ్చే ఎన్నికలలో నేను నెల్లూరు నుంచే పోటీ చేస్తాను. గెలుస్తాను. రాత్రి ఫుల్‌గా తాగేసి వాగడం కాదు దమ్ముంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడమని వాళ్ళకు సవాలు విసురుతున్నాను. నేనెప్పుడు అవినీతికి అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడలేదు. కానీ వాళ్ళ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు నెల్లూరు ప్రజలందరికీ తెలుసు. కనుక ఇక తగ్గేదేలే… ఇకపై నేనే వాళ్ళకి రోజూ సినిమా చూపిస్తాను. తట్టుకోగలరో లేదో?” అని విరుచుకుపడ్డారు.

ADVERTISEMENT
Latest Stories