నాడు డిజిపిని కలవనీయలేదు…నేడు ఆమె వద్దకే

Home Minister Vangalapudi Anitha

ఏపీలో వైసీపి, టిడిపి, జనసేనల పరిస్థితులు అనూహ్యంగా మారడం చూస్తున్నప్పుడు ఓడలు-బళ్ళు అంటే ఇదే కదా అనిపిస్తుంది. నాడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని శాసనసభలోనే అతి దారుణంగా అవమానించిన జగన్‌ శాసనసభలో అడుగుపెట్టే ధైర్యం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.

వైసీపికి ప్రతిపక్ష హోదా కూడా లభించే అవకాశం లేదు. నాడు జగన్‌, వైసీపి నేతలతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

ADVERTISEMENT

ఇక టిడిపి మహిళా నేతల్లో చాలా దారుణంగా అవమానింపబడిన వారిలో వంగలపూడి అనిత ఒకరు. ఆమె హోమ్ మంత్రి పదవి చేపట్టాక మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు నేను డిజిపిని కలిసి వినతి పత్రం ఇద్దామని వెళితే నన్ను లోనికి రానీయలేదు. అప్పుడు నేను గట్టిగా వాదిస్తే డిజిపి దగ్గరకు తీసుకువెళతామని చెప్పి ఓ హెడ్ కానిస్టేబుల్‌కి వినతిపత్రం ఇప్పించి పంపించేశారు.

నేను ఆనాడే చెప్పాను… మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రోటోకాల్ ప్రకారం నన్ను మీరే లోనికి తీసుకువెళతారని. మా నాయకుడు చంద్రబాబు నాయుడు నాకు హోమ్ మంత్రి పదవి ఇవ్వడంతో నేడు అదే జరుగుతోంది,” అని అన్నారు.

ఈ మార్పు ఒక్క టిడిపి నేతల విషయంలోనే కాదు… ఆనాడు జగన్‌ పాలనలో హింస, అవమామానాలు, నిరాధారణకు గురైన కాకినాడ, రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్ర వంటి మాతృమూర్తుల పరిస్థితి కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కూతురు సాయిలక్ష్మి వెన్నెముక దెబ్బతినడంతో శస్త్రచికిత్స కోసం ఆమె తన ఇల్లు అమ్ముకునేందుకు సిద్దపడారు.

కానీ మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌ ఆ ఇంటిని ఎవరికీ అమ్మకుండా అడ్డుపడేవాడు. జగన్‌ని కలిసి మొర పెట్టుకోవాలంటే అక్కడి నుంచి పోలీసులు అక్కడి నుంచి తరిమికొట్టారు. అప్పుడు ఆమె నిరాశ నిస్పృహలతో మణికట్టు కోసుకొని అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ఈ వార్తా మీడియాలో రావడం టిడిపి నేతలు గట్టిగా నిలదీయడంతో ఆమెపై ‘పిచ్చిది’ అనే ముద్రవేసి తప్పించుకున్నారు. వైసీపి నేతలు ఆమెకు సాయపడకపోగా ఆమె వలన తమకు అప్రదిష్టకలుగుతోందని వేధిస్తుండటంతో ఆమె కాకినాడ నుంచి కూతురుని వెంటబెట్టుకొని హైదరాబాద్‌ పారిపోయి అక్కడ బంధువుల ఇంట్లో ఇన్ని రోజులు తల దాచుకోవలసి వచ్చింది.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ మాతృమూర్తికి ఫోన్ చేసి తన కార్యాలయానికి పిలిపించుకొని ఆమె కూతురు వైద్య చికిత్సకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. ఇంటి విషయంలో ఆమెకు నరకం చూపించిన దాడిశెట్టి రాజా గన్‌మెన్‌పై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకుంటానని ఆమెకు సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఇలాంటి ఎంతో మంది అభాగ్యులు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలు, సమస్యలు మొరపెట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories