ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ నేడు మీడియాతో మాట్లాడుతూ, “విశాఖ, విజయవాడ మెట్రో ఏర్పాటులో వివిధ కారణాలతో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వానికి మేము పంపిన ప్రతిపాదనలో కొన్ని మార్పులు సూచించింది. కనుక ఆవిధంగా మళ్ళీ రెండు నగరాలలో రీసర్వే చేయించి ప్రతిపాదనలు పంపాము. వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే మెట్రో పనులు ప్రారంభిస్తాము,” అని అన్నారు.
విశాఖపట్నంలో మొదటి దశలో 47 కిమీ మేర మూడు కారిడర్లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని నిర్మాణం కోసం రూ.11,498 కోట్లు అంచనా వేశారు.
విజయవాడలో మొదటి దశలో 38 కిమీ మేర రెండు కారిడార్లకు కలిపి రూ.10,118 కోట్లు అంచనా వేశారు.
అయితే మెట్రో కారిడార్లు ఒక్కటే నిర్మించడం కంటే డబుల్ డెక్కర్ కారిడార్-ఫ్లై ఓవర్లు నిర్మిస్తే భారీగా డబ్బు, స్థలం, సమయం అన్నీ ఆదా ఆవుతాయని మరో కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి పంపించారు. కానీ కేంద్రం దానిని అంగీకరించలేదు. కనుక కేవలం మెట్రో కారిడార్స్ నిర్మాణం కోసం మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ఈ ఏడాది డిసెంబర్నాటికి నిర్మాణ పనులు మొదలుపెట్టగలిగితే, నిర్మాణాలు పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ళుపైనే పడుతుంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి లేదా ఆ తర్వాత పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఏవైనా పనులు మిగిలిపోతే అవి పూర్తి కావాలంటే తప్పనిసరిగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలో రావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతిని వ్యతిరేకిస్తూ కొత్తగా ‘మావిగన్’ ప్రతిపాదన చేయడం గమనిస్తే ఆయన మళ్ళీ వస్తే అమరావతి పనులు ఎక్కడివక్కడ నిలిపివేస్తారని అర్దమవుతోంది. నిర్మాణ పనులు కొలిక్కి వస్తున్న అమరావతినే నిలిపివేస్తే, మెట్రో పనులు పూర్తి చేస్తారని ఆశించలేము. కనుక కూటమి ప్రభుత్వం ఈ కోణంలో కూడా ఆలోచించి మరీ మెట్రోకి పునాదులు తవ్వడం మంచిది.
అదేవిధంగా పునాది తవ్వే ముందే ఏపీ మెట్రో లాభదాయకత గురించి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించడం చాలా మంచిది. లేకుంటే ఏపీ మెట్రో కూడా రుషికొండ ప్యాలస్లా వృధాగా మిగిలిపోయి ప్రభుత్వానికి గుదిబండలా మారుతుంది.




