ఉత్తరాది నుంచి వచ్చే అందాల భామలు దక్షిణాది భాషలు నేర్చేసుకొని టకటకా సినిమాలు చేసేస్తుంటారు. కనుక బిజేపి పెద్దలు వారి దగ్గర ఆ కిటుకు ఏదో తెలుసుకోగలిగితే దక్షిణాది రాష్ట్రాలలో కూడా కాషాయజెండా రెపరెపలాడించవచ్చు. కానీ అది సాధ్యం కాదు కనుక దక్షిణాదిలో బిజేపి ఆపసోపాలు పడుతూనే ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, తెలంగాణలో ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించేసి కూర్చొన్న కొమ్మని నరుక్కున్నట్లే, తమిళనాడులో కూడా ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు అన్నామలైని తప్పించేశారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల ప్రభావం చాలా ఉన్నప్పటికీ ఆయన బిజేపి చాలా బలోపేతం చేశారు. కనుక ఈసారి ఎన్నికలలో బిజేపికి సీట్లు, ఓట్లు శాతం పెరిగి ఉండేది. కానీ అన్నాడీఎంకేతో పొత్తు కోసం ఆయనని తప్పించడంతో బిజేపి నష్టపోయిందని రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు అయన పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. నేడు ఢిల్లీలో బిజేపి పెద్దలను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది. కానీ అయనని పార్టీలో కొనసాగాలని రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ అయన పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయన పార్టీ హైకమాండ్ ముందు చేతులు కట్టుకొని, దాని ఆదేశాలు తీసుకోవడం స్వీకరించాలని కోరుకోవడం లేదు. తమిళనాడులో బిజేపిని తన సొంత ఆలోచనలు, సొంత పద్దతిలో నడిపించి బలోపేతం చేసుకోవాలనుకున్నారు. అలాగే హిందూమతం, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే ద్రవిడ పార్టీలతో అంటకాగుతూ వాటిని నమ్ముకొని రాజకీయం బలపడాలనుకోవడం కంటే రాష్ట్రంలో సొంతంగా నిలబడాలని అన్నామలై ఆలోచన అని సన్నిహితులు చెపుతుంటారు. కానీ అయన ఆలోచనలను బిజేపి అధిష్టానం అర్థం చేసుకోలేకపోయోందో లేక అర్ధరహితమనుకుందో కానీ తీసి పక్కన పెట్టేసింది. కనుక ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్ళి తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా కొత్త పార్టీతో ముందుకు సాగాలనుకుంటున్నారని సమాచారం.
కనుక బిజేపి పెద్దలకు దక్షిణాది భాషలు నేర్చుకోకపోయినా పర్వాలేదు. కానీ దక్షిణాది ప్రజలు, ప్రభుత్వాలు, పార్టీల ఆలోచనలు, అవసరాలు, ఆకాంక్షలు, కోర్కెలు, ఆశలు అర్థం చేసుకొని, కాస్త భిన్నంగా రాజకీయాలు చేస్తూ ఈ పాటికి దక్షిణాదిన కూడా అల్లుకుపోయేదేమో?




