నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. సూపర్ సిక్స్-సూపర్ హిట్ అంటూ సంతోషంగా సమావేశాలు మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం, మొదట బాలయ్య వ్యాఖ్యలతో, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావుల మాటలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది.
శాసనసభలో ప్రతిపక్షపార్టీ ఉండి ఉంటే పరస్పర విమర్శలు, వాగ్వాదాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేలు నోరు జారడం సహజమే. కానీ సభలో ప్రతిపక్షమే లేనప్పుడు అధికార పార్టీ సభ్యులు నోరుజారి లేదా అనాలోచితంగా ఏదో మాట్లాడి తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడం, సభలో లేని ప్రతిపక్షం కూడా తమ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేలా చేయడం చాలా ఆశ్చర్యకరమే.
కొత్తగా శాసనసభ్యులుగా ఎన్నికైనవారికి శాసనసభలో ఏవిదంగా వ్యవహరించాలో తెలియదు. అలాగే సభ నియమ, నిబంధనలు తెలియవు. కనుక వారికి ముందుగా కొన్ని రోజులు శిక్షణ ఇస్తారు. కానీ అన్నీ తెలిసిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవిదంగా సభలో మాట్లాడుతుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అదీ… సభలో ప్రతిపక్షమే లేనప్పుడు!
బాలయ్య మాటలపై వైసీపీ ఎంత రాద్దాంతం, ఏవిదంగా రాజకీయాలు చేస్తోందో ఆయనతో సహా అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన కారణాల వలన సిఎం చంద్రబాబు నాయుడు ఆయనకు గట్టిగా చెప్పలేకపోయారు.
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ అవకాశం కల్పించడంతో సిఎం చంద్రబాబు నాయుడు అందరికీ కలిపి ‘సభలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీదా?’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇది తనకు కూడా వర్తిస్తుందని బాలయ్య కూడా గ్రహించే ఉంటారు.
వైసీపీ హయంలో జగన్ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని, చివరికి రాజకీయాలతో సంబంధం లేని అయన సతీమణి భువనేశ్వరి గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. అందుకు ప్రజలు వైసీపీని గద్దె దించి బుద్ధి చెప్పారని కూటమి సభ్యులే చెపుతుంటారు.
కనుక సభలో మనమందరం హుందాగా వ్యవహరించాలని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతూనే ఉంటారు. సభలో వైసీపీ లేకపోవడం వలన ఇంతకాలం చాలా హుందాగా, సాఫీగానే సమావేశాలు సాగుతున్నాయి. కానీ ఈసారి ముగింపులో ఈవిదంగా జరగడం బాధాకరమే. కానీ ఇది పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తపడితే ప్రజలు కూడా హర్షిస్తారు.




