నాలుగో జాబితా వచ్చేస్తోంది… వైసీపిలో అందరూ రెడీయేనా?

Jagan YCP Fourth List

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను, చివరికి కొందరు మంత్రులను కూడా నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. అంటే వారందరూ అసమర్దులని వారి అధినేత స్వయంగా ముద్ర వేస్తున్నారన్నమాట!

అందుకే టిడిపి, జనసేనలు, “ఒక నియోజకవర్గంలో పనికిరారానుకున్నప్పుడు వారు వేరే నియోజకవర్గంలో మాత్రం ఎలా పనికివస్తారు?” అని ప్రశ్నిస్తున్నాయి. వాటితో పాటు పక్కన పెట్టబడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్‌ దక్కని నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కరే విధాన పరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేయిస్తున్నప్పుడు, వాటికి తమను ఎలా బాధ్యులను చేస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. నువ్వే మా నమ్మకం… నువ్వే మా భవిష్యత్‌ జగన్‌ అని తమ చేత భజన చేయించి ఇప్పుడు పనికిరారని ముద్రవేసి పక్కన పెట్టేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అయితే జగన్మోహన్‌ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఈవారంలోనే నాలుగో జాబితాని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.

మొదటి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27మందిని, మూడో జాబితాలో 21 మంది ఎమ్మెల్యేలు,. నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చారు. మొత్తంగా 59 మందికి టికెట్స్ ఖరారు చేసారు. నాలుగో జాబితాలో జగన్‌ ఎంతమందిని మారుస్తారో, ఎంతమందికి టికెట్స్ ఇవ్వకుండా పక్కనపెట్టేస్తారో త్వరలోనే తేలిపోతుంది.

దీంతో టికెట్‌ లభించదని భయపడుతున్న ఎమ్మెల్యేలు, టికెట్‌ ఆశిస్తున్నవారు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు తీవ్ర ఆందోళనతో చేతులు జోడించి తాడేపల్లి ప్యాలస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. పనిలో పనిగా వైఎస్ షర్మిల త్వరగా వచ్చి ఏపీ కాంగ్రెస్‌ తలుపులు తెరవాలని దేవుళ్ళకు మొక్కుకొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories