పోలింగ్ ముగిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళిపోయారు. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుండగా ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళిపోవడాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తప్పు పట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయనే డిజిపి, పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో సహా పలువురుపై వేటు వేసిందని, కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయారని లక్ష్మినారాయణ విమర్శించారు.
ఈసారి ఎన్నికలలో వైసీపి ఓటమి ఖాయం అన్నట్లు పార్టీ నేతలు, మంత్రులు ఆక్రోశిస్తుంటే వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడాల్సిన జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయారని వైసీపి నేతలు కూడా చెవులు కోరుకుంటున్నారు. ఇది అప్రస్తుతం.
పోలింగ్ ముగియగానే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు బయలుదేరడంపై టిడిపి, జనసేనలు కూడా విమర్శిస్తున్నాయి. ఆయన ఓటమి భయంతోనే విదేశాలకు పారిపోతున్నారని, మళ్ళీ తిరిగివస్తారో లేదో అని ఎద్దేవా చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఇన్ని కోణాలు కనిపిస్తుంటే మరో కొత్త కోణం కూడా వైసీపి ఆవిష్కరించి చూపుతోంది.
జగన్మోహన్ రెడ్డి లండన్లో దిగినప్పటి నుంచి అక్కడ ఆయన అభిమానులు రోడ్డుకి ఇరువైపులా నిలబడి “పులివెందుల పులిబిడ్డ… ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి జై” అంటూ నినాదాలు చేస్తున్న ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి చూస్తుంటే ఆయన ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలిసారి లండన్ వచ్చిన్నట్లు… అక్కడి వీరాభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికిన్నట్లుగా అనిపిస్తోంది. వైసీపి అలాగే హైలైట్ చేస్తోంది.
ఈసారి వైసీపి కనీసం మెజార్టీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకున్నా ఆయనకు లండన్లో జేజేలు పలికినా అర్దం ఉంటుంది. కానీ ఓటమి అంచున ఉన్న జగన్మోహన్ రెడ్డి, లండన్ వెళితే అదేదో ఘనకార్యమన్నట్లు వైసీపి చూపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఒకవేళ ఆయనకు గెలుపుపై అంత నమ్మకమే ఉన్నట్లయితే ఫలితాలు వెలువడే వరకు అక్కడే ఉండిఅభిమానులతో కలిసి అక్కడే విజయోత్సవం నిర్వహించుకుంటే, జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తుంది కదా?
అయితే హటాత్తుగా జగన్ లండన్ పర్యటనకు ఈ హైప్ దేనికంటే జగన్ గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారని తెలియజేస్తూ ఓటమి భయంతో తీవ్ర ఆందోళనతో ఉన్న వైసీపి నేతలకు, శ్రేణులకు కాస్త ఊరట కల్పించడం కోసమే కావచ్చు. ఈ అల్పసంతోషాన్ని ఎవరైనా ఎందుకు కాదనాలి?




