ఆత్మశుద్ధి లేని యాచారమది ఏల? చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా? అని వేమన ఎప్పుడో ప్రశ్నించారు. మనిషి జీవన విధానంలో లోటుపాట్లని చాటి చెప్పిన అలాంటి పద్యాలు ఎప్పటికీ ప్రజల నాలుకలపై ఉన్నాయంటే, అలాంటి పరిస్థితులు నేటికీ ఉన్నందునే. లేకుంటే సాధారణ బల్బు, టైప్ రైటర్, ఫ్లాపీ డిస్కులను మరిచినట్లే వేమన పద్యాలు కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవి కదా?
ఇంతకీ విషయం ఏమిటంటే, వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలం, భూమయ్యగారి పల్లెలో కొత్తగా నిర్మించిన గట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత స్వామివారి సుదర్శన హోమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు, పురోహితుల వేదాశ్వీరాదాలు స్వీకరించారు.
రాజకీయాలలో ఉన్నవారు ఏ మతానికి చెందినవారైనా ఈవిధంగా ఇతర మత కార్యక్రమాలలో పాల్గొంటారు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి వారు కూడా ఇతర మతాల కార్యక్రమాలలో పాల్గొంటారు. కనుక క్రీస్టియన్ మాతాన్ని పాటించే జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా హిందూమత కార్యక్రమాలలో పాల్గొనడం విచిత్రం కాదు.
అయితే ఇటువంటివి ఆయా మతాలను గౌరవిస్తున్నట్లుగా చెప్పుకోవడానికి, కుదిరితే ఆయా మతాల ఓటర్లను ఆకర్షించడానికే తప్ప ముందే చెప్పుకున్నట్లు నమ్మకం, విశ్వాసం లేని ఇటువంటి పనులు నిరర్ధకమే.
ముఖ్యంగా వైసీపీ హయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం వంటి అనేక పరిణామాలు జరిగినందున ఇటువంటి పూజలు, హోమాలు ఎన్ని చేసినా జగన్ హిందువుల నమ్మకం పొందడం చాలా కష్టమే.
కానీ హిందువులు కులాలు, పార్టీల వారీగా చీలిపోవడం ఆయన అదృష్టమనే చెప్పాలి. ఈ పూజలు, హోమాలతో అటువంటివారిని మెప్పించవచ్చు.




