ఐ-ప్యాక్…. వియ్ ప్యాక్!

Jagan Ipac

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం విజయవాడలో ఐ-ప్యాక్ (ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఈ ఎన్నికలలో తమ పార్టీని గెలిపించేందుకు ఎంతగానో కృషి చేసిన ఐ-ప్యాక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికే జగన్‌ వెళుతున్నట్లు పైకి చెప్పుకునే వార్త.

అయితే వైసీపి ఓటమి దాదాపు ఖాయం అని తేలిపోగానే తాడేపల్లి ప్యాలస్‌లో టీవీ బద్దలయ్యే ఉంటుందని, ఇప్పుడు ఐ-ప్యాక్ కార్యాలయంలో కూడా బద్దలు కొట్టి, అందరి చెంపలు చెళ్ళుమనిపించేసి తన కోపం, ఆవేశం చల్లార్చుకోవడానికే బహుశః వెళుతున్నారేమో? అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ ఎన్నికలలో 175 సీట్లు గెలుస్తామని జగన్‌కు, వైసీపి నేతలకు ధీమా ఉండి ఉంటే నేడు వైసీపి విజయోత్సవాలలో మునిగి తేలుతూ ఉండేది. గతంలోలాగే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఐ-ప్యాక్ బృందాన్ని ఘనంగా సత్కరించి ఉండేవారు. కానీ వైసీపి ఓటమి ఖాయమని వైసీపి నేతలు ఏడుపు మొహాలు పెట్టుకొని మాట్లాడుతుంటే, జగన్‌ విదేశాలకు వెళ్ళిపోయే ముందు పనిగట్టుకొని నేడు ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి?అంటే వారి చెంపలు చెళ్ళుమనిపించేందుకే అని నెటిజన్స్ వాదిస్తున్నారు.

ఇంతకాలం తనకు, తన ప్రభుత్వానికి, వైసీపికి కూడా ఐ-ప్యాక్ శల్యసారధ్యం చేసిందని అందుకే ఓడిపోతున్నామని జగన్‌ బాధపడుతున్నట్లయితే అది తప్పే అవుతుంది. ఐ-ప్యాక్ ఎప్పటికప్పుడు ఆయనను హెచ్చరిస్తూనే ఉంది. జగనే వారి సలహాలు, సూచనలను పట్టించుకోలేదు.

సంక్షేమ పధకాలే తమకు 175 సీట్లు తెచ్చిపెడతాయని జగన్‌ చాలా నమ్మకంగా ఉన్నారని కానీ అది చాలా తప్పుడు విధానమని ఏడాది క్రితమే చెప్పానని, ఈ ఎన్నికలలో వైసీపికి 51 సీట్లు వస్తే చాలా ఎక్కువే అని ఐ-ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌ ఇటీవలే చెప్పారు.

కొందరి చేతులకు ఆరో వేలు ఉంటుంది. కానీ దాని వలన ఏ ఉపయోగమూ ఉండన్నట్లే డజన్ల కొద్దీ సలహాదారులు కూడా జగన్‌ ప్రభుత్వానికి నిరుపయోగంగా మిగిలిపోయారు.

కర్ణుడు మహా వీరుడు. అతని వద్ద అనేక శక్తివంతమైన ఆయుధాలుండేవి. కానీ శాపగ్రస్తుడు కావడం వలన అవేవీ యుద్ధంలో అతనికి ఉపయోగపడలేదు. అలాగే జగన్‌ విపరీత ధోరణి కారణంగా గత ఎన్నికలలో వైసీపికి విజయం సాధించి పెట్టిన ఐ-ప్యాక్ కూడా ఉపయోగపడలేకపోయింది. కనుక ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే అందుకు ఎవరినో నిందిస్తూ ఆక్రోశం, ఆవేశం చల్లార్చుకోవచ్చునేమో కానీ మరే ఉపయోగమూ లేదు. ఇది నూటికి నూరు శాతం స్వయంకృతాపరాధమే. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా కాలిన చేతులు నయమవవు.

ADVERTISEMENT
Latest Stories