తెలంగాణలో నియంతృత్వ పాలన చేశారనే తీవ్ర అపవాదుమూటగట్టుకున్న మాజీ సిఎం ప్రతిపక్షాలను రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నమే చేశారు తప్ప ప్రతిపక్ష నేతలపై ఏదో ఓ సాకుతో కేసులు పెట్టి, జైలుకి పంపించి అడ్డుతొలగించుకోవాలనుకోలేదు. కానీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నేతలను రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకు వారిపై కేసులు పెట్టించి వేధించడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు, నారా లోకేష్తో సహా టిడిపిలో కేసులు నమోదు కానీ నేతలెవరూ లేరనే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుని సుమారు రెండు నెలలు జైల్లో పెట్టించారు కూడా.
కానీ చేతిలో అధికారం ఉన్నప్పటికీ, దేశంలో న్యాయస్థానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ కాపు కాస్తూనే ఉన్నాయనే సంగతి మరిచిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు చంద్రబాబు నాయుడుని జైల్లో నుంచి బయటకు రానీయకుండా చేయడానికి, ఒకవేళ వస్తే మళ్ళీ వెంటనే లోపలకు పంపడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నలేవీ ఫలించలేదు. ఇది తెలిసి ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కొత్తగా కేసు నమోదు చేయించింది.
గత ఏడాది వారాహి యాత్రలో వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చాలా అనుచితంగా మాట్లాడారని, వాటితో వారి ఆత్మగౌరవం దెబ్బ తిందని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయనేది ఫిర్యాదు. తాడికొండ మండలంలోని కంతేరుకు చెందిన బి.పవన్ కుమార్ అనే వాలంటీర్, మరికొందరు ఇచ్చిన వాంగ్మూలం మేరకు గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టులో ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ వేశారు.
దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెక్షన్స్ 499,500 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి, మార్చి 25న జరిగే విచారణకు హాజరు కావాలంటూ పవన్ కళ్యాణ్కు నోటీస్ పంపింది.
కానీ న్యాయస్థానం గత ఏడాది జూలై 20వ తేదీన పవన్ కళ్యాణ్పై చర్యలు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేస్తే, నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు దీనిని పైకి తీసి పవన్ కళ్యాణ్పై ఈ కేసు నమోదు చేయించడం గమనిస్తే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ని కట్టడి చేయడానికే ఇంత ఆలస్యం చేసిన్నట్లు అర్దమవుతూనే ఉంది.
కానీ చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించి ఏదో సాధిద్దామనుకుంటే చివరికి ఏమైంది? దాని వలన టిడిపి, జనసేనల పొత్తులు వెంటనే ఖరారు అయ్యాయి. చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో సానుభూతి పెరిగింది. ఆయనను ఈవిదంగా వేధించినందుకు జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరుగబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఈ ఒకే ఒక్క కేసుతో వైసీపి పూర్తిగా దూరం చేసుకొంటోంది. ఇవన్నీ వైసీపికి రోజులు దగ్గర పడ్డాయనే సంకేతాలే కదా?





