స్టార్ హీరోలు రాజకీయాలతో ముడిపడినప్పుడు ఎంత లేదన్నా పరస్పర ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ పార్టీ నడుపుతుంటే సహజంగానే అధికార పక్షంలో అలజడి రేగడం సహజం. ఈ అసహనమే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సమయంలో ఏకంగా రెవిన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా ఉంచేలా చేసింది.
కేవలం పది రూపాయలకు టికెట్లు అమ్మేలా బిసి సెంటర్ల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. తర్వాత వచ్చిన ఏ కొత్త రిలీజుకు ఇలాంటి ట్రీట్ మెంట్ జరగలేదు, చూడలేదు. ప్రస్తుతం వారాహి యాత్రలో పవన్ వాడివేడిగా వైసిపి మీద విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నాడు. సహజంగానే ఇది రూలింగ్ పార్టీకి మింగుడు పడటం లేదు.
ఏకంగా కుల నాయకులతో లెటర్లు రాయించేదాకా చక్రం తిప్పారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేల మాటల దాడులు యథాతథం. ఇంకో ముప్పై అయిదు రోజుల్లో బ్రో రిలీజ్ కానుంది. వినోదయ సితం రీమేక్ గా రూపొందుతున్నప్పటికీ అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలోలా హఠాత్తుగా టికెట్ రేట్ల జిఓలు, గవర్నమెంట్ ఆఫీసర్ల చెకప్పులు ఉంటాయేమోనని ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు.
నిజానికి ఈసారి వ్యవహారం అంత తేలికగా ఉండదు. ఒకవేళ ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేస్తే జనానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రభుత్వ చర్య సులభంగా అర్థమైపోతుంది. ఈ పోకడని పవన్ ఇంకో ఆయుధంగా వాడుకుని ఎన్నికల ప్రచారంలో పబ్లిక్ కి చేరవేస్తాడు. ఇదొక్కటే కాదు డిసెంబర్ లేదా జనవరిలో ఓజి విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
దాన్ని కూడా నియంత్రించాలని చూస్తే ఏ హీరోకి లేని నిబంధనలను తనకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని పవన్ పదే పదే ప్రశ్నిస్తే దానికి సమాధానం అంత సులభంగా రాదు. భీమ్లా నాయక్ వచ్చే నాటికి వైసిపి పాలన సగమే అయ్యింది. అందుకే ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు తొమ్మిది పది నెలల్లో ఎలక్షన్లను పెట్టుకుని కావాలని పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేసుకుంటే థియేటర్లకు వెళ్లని జనాలకు కూడా ఈ ప్రతీకార చర్య వెనుక ఉద్దేశం అర్థమైపోతుంది.
అందుకే బ్రో, ఓజిల విషయంలో మరీ తీవ్రంగా అడుగులు వేయకపోవచ్చు. ఏపీ సర్కారు చేసిన పనులవల్ల నేను నిర్మాతలకు ముప్పై కోట్లకు వెనక్కు ఇచ్చానని చెప్పిన పవన్ కు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైతే ఇంకా బలంగా తీసుకెళ్తాడు. అందుకే వైసిపి నుంచి టికెట్ కంట్రోలింగ్ కంటే డ్యామేజ్ కంట్రోలింగే ఉండొచ్చు మరి. లేదూ మా మొండితనం మాదేనంటే దానికి మూల్యం కూడా వాళ్లదే.



