ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు దేశం, రాష్ట్రం, ప్రజల కోసం పనిచేయాలి కనుక చేస్తుంటాయి. కానీ ప్రతిపక్షం, దాని సొంత మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తుంటే దానిని ఖండిస్తూ, వివరణ ఇచ్చుకోవడం కూడా ఇప్పుడు ఓ పెద్ద పనిగా మారింది.
ముఖ్యంగా శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి.
దీని కోసం ప్రభుత్వంలో ‘ఫ్యాక్ట్ చెక్’ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ సమస్య తీవ్రత అర్ధమవుతుంది.
రాష్ట్ర విభజనతో ఒకసారి, వైసీపీ అసమర్దత పాలనతో మరొకసారి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అణుబాంబులు, సునామీలు, భూకంపాలను తట్టుకొని నిలబడిన జపాన్ దేశంతో పోల్చవచ్చు.
ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే, ఓ మాజీ సిఎంగా జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులుగా వైసీపీ నేతలు సంతోషించాలి కదా? కానీ ఈవిధంగా దుష్ప్రచారం చేస్తూ, ఆటంకాలు సృష్టిస్తుంటే రేపు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పకుండా ఉంటారా? అని ఆలోచించాలి కదా?
నాడు జగన్ ప్రభుత్వం డీఎస్సీ గురించి మాట్లాడిన మాటలు, ఆడిన డ్రామాలు అందరికీ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది. అప్పుడే మరో డీఎస్సీకి సిద్దమవుతోంది.
ఐదేళ్ళలో తాను చేయలేకపోయిన ఈ పనిని తన కంటే వయసులో, అనుభవంలో చిన్న వాడైన మంత్రి నారా లోకేష్ చేసి చూపినందుకు సంతోషించకపోయినా సుమారు 16 వేలమందికి పైగా ఉద్యోగాలు లభించినందుకు సంతోషించాలి కదా? కానీ డీఎస్సీకి కూడా ఏడ్పులే!
తాజాగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ చేత మాట్లాడించిన మాటలు మరో ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అందుకు ఆయన పాపం లెంపలు వేసుకోవాల్సి వచ్చింది. ఆయన క్షమాపణలు చెప్పుకొని వెనక్కు తగ్గినా వైసీపీ దాని అనుకూల మీడియా ఏ మాత్రం వెనక్కు తగ్గకపోవడం విశేషం.
ఆయనపై ఏపీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి కనుక ఆయనని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారంటూ కాలకేయ సైన్యం మరో దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇలాంటి దుష్ప్రచారాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు ఖండించకపోతే ప్రజలు ఇదే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. కనుక ఏపీ ఫ్యాక్ట్ చెక్ దానిని రీట్వీట్ చేస్తూ ఫేక్ న్యూస్ అని ఖండించింది.
వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారానికి అంతూ పొంతూ ఉండటం లేదు. కనుక దాని దుష్ప్రచారాలు ఖండించడానికి, ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు వివరించడానికి, తక్షణమే వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖని, దానికో మంత్రిని, అధికారులను కూడా నియమించుకోవాల్సి వస్తుందేమో?




