ఏపీలో వివేకా హత్య కేసు, మద్యం కుంభకోణం కేసు, తిరుమల కల్తీ నెయ్యి కేసు వంటివి ఓ డజనుకు పైగా కేసుల విచారణ ఏవిధంగా అంతూ పొంతూ లేకుండా సాగిపోతోందో, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎఫ్-1 రేసింగ్ కేసు, కాళేశ్వరం కేసుతో సహా ఓ డజను కేసుల విచారణ నత్తనడకన సాగిపోతున్నాయి.
వాటిలో నిందితులపై చర్యలు తీసుకోలేకపోవడం ప్రభుత్వాల నిస్సహాయత అనుకోవాల్సి ఉంటుంది లేదా వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ బలం, పరపతికి సాటిలేదనుకోవాల్సి ఉంటుంది.
ఆ కేసుల విచారణ ఇలా సాగుతోంది కనుకనే వాటి గురించి ప్రజలు కూడా మరిచిపోయారు. బహుశః ఆ రెండు పార్టీల నేతలు, అధినేతలు కూడా మరిచిపోయే ఉంటారు.
కానీ ప్రజలు పూర్తిగా మరిచిపోతే ఆ తర్వాత ఈ కేసుల్లో కదలికలు తెచ్చినా వాటి ప్రభావం ఉండదు కనుక అప్పుడప్పుడు ఆ కేసులకు సంబంధించి అధికార పార్టీలు ప్రజలకు ‘బైట్స్’ ఇస్తుంటాయి.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “2023లో నేను రేవంత్ రెడ్డికి సన్నిహితంగా పనిచేసేవాడిని కనుక కేసీఆర్ ప్రభుత్వం నా ఫోన్ కూడా ట్యాప్ చేయించింది. సొంత కూతురు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాప్ చేయించిన వ్యక్తి మా ఫోన్లు విడిచి పెడతారని అనుకోలేము కదా?
రాష్ట్రంలో వేలాదిమంది ఫోన్లు ట్యాపింగ్ జరిపి రహస్యంగా అందరి సంభాషణలు విన్నారు. కేసీఆర్ తన రైట్ హ్యాండ్ వంటి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు. అందుకే అయన డ్రైవర్, పీఏని మార్చుకున్నారు,” అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
అయితే కేసీఆర్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని తెలిసి ఉన్నా నాడు కల్వకుంట్ల కవిత, హరీష్ రావు ఎవరూ ఆయనని నిలదీసిన దాఖలాలు లేవు. కనీసం కేసీఆర్ని విడిచిపెట్టలేదు. ఎందువల్ల? పైగా కేసీఆరే శ్రీరామరక్ష అనేవారు. నేటికీ హరీష్ రావు అంటూనే ఉన్నారు కదా?
ఇదేవిధంగా ఏపీలో జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణకి అప్పుడప్పుడు విజయసాయి రెడ్డిని రప్పిస్తే ఆయన నాలుగు ముక్కలు మాట్లాడి వెళుతుంటారు. అందుకే ఆ కేసుతో సహా ఇతర కేసుల గురించి ఎప్పుడైనా మీడియాలో వార్తలు వచ్చినా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.




