అసలే ఆర్థిక లోటు… ఆపై రోజు వారి ఖర్చులు… దీంతో అప్పు తీసుకోక తప్పని పరిస్థితి. వెరసి నవ్యాంధ్రప్రదేశ్ క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇంకా సగం కూడా గడవలేదు… ఈ అయిదు మాసాలలో ఏకంగా ఆరోసారి రుణం కోసం ఏపీ దరఖాస్తు చేసుకుంది. గడచిన నాలుగు నెలల్లోనే ఐదు సార్లు అప్పులు తీసుకున్న ఏపీ… తాజాగా ఆరో రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకుంది.
తాజా దరఖాస్తులో రూ.400 కోట్ల రుణానికి అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆర్బీఐకి విన్నవించింది. ఆర్థిక లోటు భర్తీకి సహకరిస్తామని చెప్పిన కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్న నేపథ్యంలో ఏపీకి అప్పులే దిక్కుగా మారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఐదుసార్లు అప్పు తీసుకున్న ఏపీ… మొత్తం 6,050 కోట్ల అప్పు తీసుకుంది. తొలి మూడు విడతల్లో ఒక్కో విడతలో 1,500 కోట్ల చొప్పున 4,500 కోట్లు… నాలుగో విడతలో 800 కోట్లు, ఐదో విడతలో 750 కోట్లు సమీకరించింది.
తాజాగా మరో 400 కోట్ల రుణానికి అనుమతించాలని ఏపీ సర్కారు చేసుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఏపీ అప్పు 6,450 కోట్లకు చేరనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో భారీ ఆర్థిక లోటు నేపథ్యంలో ఏపీ అప్పుల బాట పట్టక తప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంత ధీన స్థితిలో ఉన్నా, కేంద్రం మాత్రం కనికరం చూపకుండా ‘మా పరిస్థితి కూడా మీలాగే ఉంటోంది’ అని వ్యాఖ్యానించడం విశేషం.



