రాజకీయాలలో అధికారంలోకి రావాలన్న ఆశ ఉండడం సహజమే. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అయితే అదొక్కటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షానికి కూడా అర్హత లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఆశ ఎంత ఉందో తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే! గత రెండు సంవత్సరాలుగా… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది తామే… అంటూ చెప్పుకుని తిరుగుతున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికే షాక్ ఇచ్చే విధంగా, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధికారం పీఠం గురించి వ్యాఖ్యలు చేసారు.
“2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే” అంటూ ఓ ప్రకటన చేసారు రఘువీరారెడ్డి. ‘ప్రత్యేక హోదా’కు సంబంధించి కృషి చేస్తోన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే కనుక, ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడతారు అనేది రఘువీరా గారు వెల్లడించిన లాజిక్. నిజంగా ప్రజల్లో ‘స్పెషల్ స్టేటస్’ పట్ల అంత మక్కువ ఉంటే, రఘువీరారెడ్డి చెప్పినట్లుగా చేసేవారేమో చెప్పలేం గానీ, ‘ప్రత్యేక హోదా’ ఇక రాదని భావించిన ఏపీ ప్రజానీకం, సదరు అంశాన్ని ఎంత ‘లైట్’గా తీసుకోవాలో అంతే స్థాయిలో తీసుకున్నారు.
మరి అలాంటి అంశంతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ‘అవుట్ డేటెడ్’ అనుకోవాలో లేక ఈ రాజకీయ నేత ‘అప్ డేట్’ అవ్వాలని అనుకోవాలో గానీ, రఘువీరా చేసిన ప్రకటన మాత్రం ప్రజల్లో ఆహ్లాదకరమైన కామెడీని పండిస్తోంది. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ, ఒకే ఒక్క స్థానంలో డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, 2019 ఎన్నికల్లో కాదు, 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా… అది పెద్ద ‘వండర్’గానే నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న తరుణంలో… రఘువీరారెడ్డి చేసిన ప్రకటన కామెడీని కాక ఏం పంచుతుందిలేండి..! ఈ హాట్ హాట్ సమ్మర్ లో రఘువీరా చేసిన కూల్ కూల్ కామెడీని ఎంజాయ్ చేయండి మరి..!



