దాదాపు రెండున్నరేళ్ళుగా కాళేశ్వరం ప్రాజెక్టు, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి గొడవల్లోకి ఆంధ్రాని లాగుతూనే ఉన్నారు.
ఆంధ్రాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి రంగాన్ని కూడా విస్మరించి సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇచ్చింది. కనుక రాష్ట్రంలో సాగునేటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. చేసిన నిర్వాకం సరిపోదన్నట్లు నేటికీ వైసీపీ రాజకీయాలు చేస్తూనే ఉంది. వాటితో కూటమి ప్రభుత్వానికి నిత్యం తలనొప్పులు తప్పడం లేదు.
ముఖ్యంగా పోలవరం పట్ల వైసీపీ ఉదాసీన వైఖరి గురించి ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే నాడు సాగునీటి శాఖమంత్రిగా చేసిన అంబటి రాంబాబు చెప్పిన ఈ మాట చాలు. “పోలవరం ప్రాజెక్టు గురించి నాకు అర్థం కాలేదు. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.”
కానీ సిఎం చంద్రబాబు నాయుడు, సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరూ పోలవరంతో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో, ఎప్పుడు ప్రారంభించబోతున్నారో ప్రకటిస్తున్నారు. ఇద్దరూ సాగునీటి ప్రా’జెక్టులని నిరంతరం పర్యవేక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చేస్తున్నారు.
అమరావతిలో ప్రధాన కట్టడాలు, మౌలిక వసతుల కల్పన పనులు వచ్చే ఎన్నికల నాటికి పూర్తవుతాయి. అమరావతి దాని కంటే ముందు పోలవరం ప్రాజెక్టు 2027 మార్చిలోగా పూర్తి చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు.
వచ్చే నెల 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్ళు వదులుతామని ప్రకటించారు. ఈ నీళ్ళు శ్రీశైలం చేరుకున్నాక సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్స్ జలవిద్యుత్ ఉత్పత్తికి కూడా చురుకుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. కుడి కాలువలో మరో 4 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. అవి కూడా ఈ ఏడాది చివరిలోగా పూర్తవబోతున్నాయి.
సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెండు రోజుల క్రితమే ధవళేశ్వరం ప్రాజెక్టు పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు అమర్చే పనులు ప్రారంభించారు.
ఓ పక్క తెలంగాణలో అధికార, విపక్షాలు సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి. మరోపక్క ఏపీలో వైసీపీ అడుగడుగునా కూటమి ప్రభుత్వానికి అడ్డుపడుతూనే ఉంది. దుష్ప్రచారం చేస్తూనే ఉంది.
అయినా పోలవరం, అమరావతి పనులు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ది ఉంటే ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు. ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు, అదేవిధంగా వైసీపీ-కూటమి ప్రభుత్వాల వైఖరి, పనితీరులో ఇంత తేడా కనిపిస్తోంది.




