తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల ప్రాజెక్టు పేరుతో చేస్తున్న రాజకీయాలను అందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో పైచేయి సాధించడానికే బీఆర్ఎస్ పార్టీ దీనిని భుజానికి ఎత్తుకుందని చెప్పక తప్పదు.
ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పేర్లు ముడిపెట్టి మాట్లాడుతుండటమే ఇందుకు చక్కటి ఉదాహరణ.
బనకచర్ల ప్రాజెక్టు పేరుతొ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ తమ కంటే వయసులో, పరిపాలనానుభవంలో, రాజకీయాలలో చాలా పెద్దవారు, సీనియర్ అయిన సిఎం చంద్రబాబు నాయుడుపై చాలా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వాటిపై సిఎం చంద్రబాబు నాయుడో, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలో లేదా కూటమి నేతలో ఎదురుదాడి చేస్తే అది పట్టుకొని అల్లుకుపోదామని అనుకున్నారు. కానీ ఏపీ వైపు నుంచి ఎవరూ ఎదురుదాడి చేయలేదు. కనీసం పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలలో అంతకంతకూ అసహనం పెరిగిపోతోంది.
కానీ చివరికి మంత్రి నారా లోకేష్ వారికి జవాబు ఇవ్వడంతో హరీష్ రావు హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి ఘాటుగా స్పందించారు.
ఇంతకీ నారా లోకేష్ ఏమన్నారంటే, “తెలంగాణ దాటి ఆంధ్రాలో ప్రవహించిన నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. ఏటా ఇది జరిగేదే. కనుక సముద్రంలో కలుస్తున్న ఆ నీటిని మేము రాయలసీమకు మళ్ళించుకుంటామంటే అభ్యంతరాలు దేనికి?
కృష్ణా, గోదావరి నీళ్ళని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకొని లబ్ది పొందాలనే మేము కోరుకుంటున్నాము. అందుకే ఎగువన తెలంగాణలో అంత పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మిస్తున్నా మేము ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. నేటికీ మేము అభ్యంతరం చెప్పబోమని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతూనే ఉన్నారు కదా?
మేమేమీ మీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువలు తవ్వుకొని ఏపీకి నీళ్ళు తీసుకుపోవట్లేదు కదా?సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని మేము వాడుకుంటే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు?దయచేసి అటువంటివి చేయవద్దు,” అని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ నేతల నుంచి ఇటువంటి స్పందన కోసమే ఆత్రుతగా ఎదురుచూస్తున్న హరీష్ రావు వెంటనే తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టి, “మేము కొట్లాడి సాధించుకున్న మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకున్నారు కనుకనే మేము బనకచర్ల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కొట్లాడవలసి వస్తోంది.
అయినా మా నీళ్ళ కోసం మేము కొట్లాడితే అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఆ లెక్కన మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు ఆనాడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ పెంచుతున్నప్పుడు, మహారాష్ట్రలో బాబ్లీ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు కొట్లాడారు కదా?అంటే అయన కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని అనుకోవాలా?” అని హరీష్ రావు ప్రశ్నించారు.
హరీష్ రావు చాలా తెలివిగానే మాట్లాడారు. కానీ ఆయన చెప్పిన దానిలోనే సమాధానం కూడా ఉంది.
నాడు సమైక్య రాష్ట్రం ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలో డ్యామ్లు ఎత్తు పెంచుకుంటూ పోతుంటే దిగువకు నీళ్ళు తగ్గిపోతాయని చంద్రబాబు నాయుడు పోరాడారు.
కానీ బీఆర్ఎస్కి పార్టీకి తెలంగాణకు ఎగువనున్న ఆ రెండు రాష్ట్రాలతో ఎటువంటి పేచీలు లేవు కానీ దిగువన ఏపీతోనే చీటికి మాటికి పేచీలు! ఎందుకంటే, తెలంగాణా ప్రజలకు చిర పరిచయమున్న చంద్రబాబు నాయుడు పేరుతో రాజకీయాలు చేస్తేనే సులువుగా తెలంగాణ సెంటిమెంట్ రాజేయవచ్చు కనుక!
కానీ “గోదావరి నీళ్ళు తెలంగాణ మీదుగా ప్రవహించి ఏపీకి చేరుకొని సముద్రంలో కలుస్తుంటే ఆ నీటిని మేము రాయలసీమకు మళ్ళించుకుంటే తెలంగాణకు ఏవిదంగా నష్టం?” అని హరీష్ రావు కంటే వయసులో, అనుభవంలో చాలా చిన్న వాడైన మంత్రి నారా లోకేష్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పనే లేదు. ఎందుకు?




