దేవుడా… ఏపీకి అన్నీ ఇచ్చేసారట… అంతా చేసేసారట..!

Arun Jaitley on AP Special statusరగులుతున్న జ్వాలలపై నీళ్ళు పోయడం పెద్ద తరహా మనుషుల పద్ధతి… అలా కాకుండా పెట్రోల్ వంటి కెమికల్స్ వేసి మరింత రగిల్చేలా చేయడం… ఎలాంటి వారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి తీరునే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల అవలంభిస్తోందని స్పష్టంగా అర్ధమవుతోంది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు అన్న వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలను బలపరిచే విధంగా తాజాగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పెదవి విప్పారు.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లించేసామని, అలాగే ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసామని చెప్పి ఇప్పటికే రగులుతున్న ప్రత్యేక హోదా మంటలపై మరింత అగ్గి రాజేసారు. ఉన్నట్లుండి ఏపీపై ఈ ఎదురుదాడి ప్రభావం ఏమిటన్నది రాజకీయ వర్గాలకు అంతుపట్టని విషయం. ఓ వైపు ఏపీలో బిజెపి సభలు పెడుతూ రాష్ట్రానికి అంత చేసాం… ఇంత చేసాం… అంటూ ప్రచారం చేసుకుంటుండగా, తాజాగా కేంద్రం కూడా అదే వైఖరిలో ప్రవర్తిస్తుండడంతో ‘టిడిపి – బిజెపి’ విడాకులకు రంగం సిద్ధమైందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT

ఇంతకాలం రెవిన్యూ లోటుపై ఆదుకుంటాం… అని ప్రకటనలు గుప్పించిన కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు మాత్రం…రెవిన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం తప్పనిసరిగా నిధులు ఇవ్వాలని ఏమీ బిల్లులో లేదని ‘చావు కబురు చల్లగా చెప్తోంది.’ మరీ ఇదే విషయాన్ని రెండు సంవత్సరాలుగా బిజెపి వర్యులు ఎందుకు చెప్పలేదు? అంటే విభజన బిల్లు అర్ధం కావడానికి వారికి రెండు సంవత్సరాల సమయం పట్టిందా? లేక ఏపీ ఉన్న దుస్థితికి తమపై తిరుగుబాటు చేయదనే భావన ఏర్పడిందా? అన్న అనేకానేక ప్రశ్నలు, ఆవేదనలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. “చెప్పేవాడికి వినేవాడు లోకువ” అన్నట్లుగా కేంద్రం చెప్తున్న మాటలు నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories