మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఆమెతో పాటు ఐదున్నరేళ్ళు వయసున్న కుమారుడు అజింక్యా ఘటన స్థలంలోనే చనిపోగా, రెండున్నరేళ్ళు వయసున్న కవల పిల్లలలో క్రాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరో పాప వీర పరిస్థితి విషమంగా ఉంది.
రెజ్లర్ అశ్వినిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు చాలా కాలంగా మానసికంగా, శారీరికంగా హింసిస్తున్నారని, ఆ వేధింపులు భరించలేకనే తన కూతురు, మనుమలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేశారు.
జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణాలు, ఆరు రజత పతకాలు గెలుచుకున్న మేటి రెజ్లర్ అశ్విని. స్వయంకృషి, కటోర శ్రమతో ఆ స్థాయికి ఎదిగిన ఆమె, వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం, అభం శుభం తెలీని తన పిల్లల ప్రాణాలు కూడా తీయాలనుకోవడం చాలా బాధాకరం.
ఒక వ్యక్తి మానసిక ఆవేదనకు ఎటువంటి కొలమానం ఉండదు. దానిని ఎవరూ అంచనా వేయలేరు. కనుక రెజ్లర్ అశ్విని ఆత్మహత్యని క్షణికావేశంలో చేసిన పొరపాటుగా తీసిపడేయలేము. కానీ ఆమెకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది గనుకనే జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోగలిగారు.
కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేనప్పుడు, ఆమె ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగి ఉండి ఉంటే.. తప్పకుండా ఆమె జీవితం, ముగ్గురు పిల్లల జీవితాలు వేరే విధంగా ఉండేవని మాత్రం చెప్పవచ్చు.
ఆమె, పిల్లల చావులకు భర్త, అతని కుటుంబ సభ్యులు కారణమా? కాదా? అనేది పోలీసులు నిర్ధారిస్తారు. కానీ ఆ స్థాయికి ఎదిగిన రెజ్లర్ అశ్విని తమ కుటుంబ సభ్యురాలైనందుకు భర్త, అత్తమామలు గర్వపడాలి. కానీ వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని రెజ్లర్ అశ్విని తండ్రి చెబుతున్నారు.
రెజ్లర్ అశ్విని ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం గమనిస్తే.. నేటికీ దేశంలో మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా వారికి ఇంట్లో వేధింపులు లేదా సమస్యలు తప్పవా? అనిపిస్తుంది.





