తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భాజపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి ఢిల్లీ వెళ్ళిన ఆయన మరికాసేపట్లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. తెరాస టికెట్ దక్కకపోవడంతో గత కొద్దిరోజులుగా బాబుమోహన్ అసంతృప్తిగా ఉన్నారు.
[m9ad]
అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మందితో కూడిన తొలిజాబితాలో బాబుమోహన్ పేరు లేని విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజా మాజీలైన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. చెన్నూరులో నల్లాల ఓదెలు స్థానంలో ఎంపీ బాల్క సుమన్ను, ఆందోల్లో బాబూమోహన్ స్థానంలో పాత్రికేయుడు చంటి క్రాంతికిరణ్ను అభ్యర్థిగా ప్రకటించారు.
దీంతో అప్పటి నుంచి బాబుమోహన్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు టిక్కెట్టు ఇవ్వలేదని ఆయనను తిట్టి పోసి తెరాసలో జాయిన్ అయ్యారు బాబు మోహన్. సీటు ఇచ్చిన కేసీఆర్ పై అనేక సంధర్భాలలో ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఈ సారి బాబు మోహన్ కు సీటు లేదన్నారు కేసీఆర్.



