వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మామ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జలక్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో గనుల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బాలినేని… వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టిన తర్వాత, తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలో విజయం సాధించి సత్తా చాటారు.
జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి స్వయానా బావమరిది అయిన బాలినేని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగానే కాక ఆర్థికంగానూ బక్కచిక్కిన బాలినేనిని ఆదుకునే విషయంలో అటు జగన్ గానీ, ఇటు వైవీ సుబ్బారెడ్డి గానీ ఆసక్తి చూపలేదన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల వెంట బాలినేని కూడా టీడీపీలో చేరడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే బాలినేని ప్రయత్నాన్ని నిలువరించే క్రమంలో ఇప్పటికే రంగంలోకి దిగిన జగన్… ఇటీవలే స్వయంగా బాలినేనిని పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆశించినంత సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగలేదని, ఈ క్రమంలో పార్టీ మారేందుకే బాలినేని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల టాక్. దీంతో తన వల్ల కాని పనిని జగన్ తన బంధు వర్గాలకు అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది.



