ఒంగోలు వైసీపిలో సెగలు మొదలయ్యాయి. నకిలీ పత్రాలతో భూకుంభకోణం వ్యవహారంలో ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇద్దరు గన్మ్యాన్ని సరెండర్ చేశారు. ఈ పంచాయితీ తాడేపల్లికి చేరింది. బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తన కార్యదర్శితో మాట్లాడించి పంపించేశారు. దీంతో బాలినేని తీవ్ర అసహనంతో ఉన్నారంటూ గత నాలుగైదు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి చూసి ఇదేదో ఒంగోలు వైసీపిలో పంచాయితీ, బాలినేనికి ఆయన ప్రత్యర్ధి వర్గానికి మద్య జరుగుతున్న ఆధిపత్యపోరని అందరూ అనుకొన్నారు.
అయితే వైసీపిలో పంచాయితీ అనేది సినిమాకి ‘ట్యాగ్ లైన్’ వంటిది మాత్రమే. ఈ సినిమా ‘టైటిల్’ మాత్రం నకిలీ భూపత్రాలతో వైసీపి నేతల భారీ భూకుంభకోణాలు అని క్రమంగా బయటపడింది.
ఒంగోలులో కొందరు వైసీపి నేతలు పాత తేదీలతో స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి వాటితో ఒంగోలు శివారులో గల భూములు, ఇళ్లకు సంబందించి నకిలీ వీలునామాలు, ఒప్పంద పత్రాలు తయారుచేసి వివాదాలు సృష్టించి కోట్లు సంపాదిస్తున్నారు.
దీనిలో వైసీపి నేతలు ఉన్నందున వారి పేర్లు బయటకు వస్తే పార్టీకి నష్టం, ప్రభుత్వానికి అప్రదిష్ట. కనుక దీనినే ఒంగోలు వైసీపిలో పంచాయితీగా కవరింగ్ ఇస్తూ బయటకు రాకుండా దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
అయితే ఈ వ్యవహారంలో తాను ఇరుకొనే ప్రమాదం ఉందని బాలినేని పసిగట్టడంతో ఆయన అప్రమత్తమైయ్యారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గన్మ్యాన్ను సరెండర్ చేయడంతో ఇంతకాలం ఒంగోలులో గుట్టుగా సాగిపోతున్న ఈ భారీ భూకుంభకోణం అకస్మాత్తుగా బయటకు పొక్కింది.
ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందినవారే ఉండటంతో పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేయలేని పరిస్థితి. అయినా ఓ 20 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా స్టాంప్ పేపర్లు, అధికారుల పేరిట వారు తయారు చేసుకొన్న నకిలీ రబ్బర్ స్టాంపులు, నకిలీ భూపత్రాలు స్వాధీనం చేసుకొన్నారు.
బాలినేని దూకుడుగా వ్యవహరించడంతో ఈ వ్యవహారంలో సిఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తాడేపల్లికి వచ్చి బాలినేని ఎదుటే వివరణ ఇచ్చుకొన్నారు. అంతవరకు చిందులు వేసిన బాలినేని ఆ సమావేశం తర్వాత చల్లబడిన్నట్లున్నారు. మళ్ళీ తన ఇద్దరు గన్మ్యాన్లను తీసుకొన్నారు. బాలినేని చల్లబడితే వైసీపి నేతల ఈ భూకుంభకోణం కేసు ప్రస్తావన వినిపించకపోవచ్చు. అంటే ఈ భారీ కుంభకోణాన్ని మెల్లగా అటకెక్కించేసే ప్రయత్నం జరుగుతున్నట్లుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ భూకుంభకోణం జరిగిందంటూ నారా లోకేష్, నారాయణ తదితరులపై కేసులు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు, ఒంగోలులో జరుగుతున్న ఈ భారీ భూకుంభకోణంపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదు?బాలినేని శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీకే చెందిన కొందరు ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు కదా?ఆయన ఫిర్యాదు మేరకు సదరు వైసీపి నేతలపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చు కదా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడూ ఆయనకి తెలియకుండానే ఏపీ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగలరు. పోలీసులు టిడిపి నేతల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. కానీ ఒంగోలులో వైసీపి నేతలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని వైసీపి ఎమ్మెల్యే బాలినేని స్వయంగా చెపుతున్నా తాడేపల్లి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు!




