వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటికే పిన్షన్, రేషన్ తీసుకువెళ్ళడానికి వాలంటీర్లను నియమించాం అంటూ సగర్వం గా చెప్పుకుంటున్న జగన్, ఆడవారి పై కుసంస్కారంగా ఎలా ప్రవర్తించాలి, ప్రతిపక్ష పార్టీల నేతలను ఎలా బూతులు తిట్టాలి, తమకు ఎదురొస్తే సొంత కుటుంబాన్ని సైతం ఎలా బజారుకు లాగాలి అనే విషయాలను తెలియచేయడానికి తన పార్టీ నేతలను, ప్రభుత్వంలోని కొందరు మంత్రులను నియమించాం అని కూడా అలానే సగర్వంగా చెప్పుకోగలరా..?
పార్టీ, ప్రభుత్వాధినేత అయినా జగన్ ఆ విషయం చెప్పినా చెప్పకున్న అదే వాస్తవం అని రాష్ట్రంలోని మెజారిటీ వర్గానికి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ లోని కొందరు బడా నాయకులు కూడా ఈ వాస్తవాన్ని బయటపెడుతున్నారు. మొన్నిఈమధ్య మాజీ వైసీపీ నాయకులు వసంత కృష్ణ మోహన్, లావు కృష్ణదేవరాయులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
వైసీపీ పార్టీలో టిక్కెట్ ఆశించాలి అన్నా, ఆ పార్టీలో ఒక గుర్తింపు గౌరవం ఉన్న పదవిని కోరుకోవాలన్నా…,వారికీ ఉండాల్సిన అర్హతలు ఇవి అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్..ఈ ముగ్గురి మీద బూతులతో మాటల దాడి చేయడం, వారిని కించపరచడం, వారి వ్యక్తిగత విషయాల మీద విమర్శలు గుప్పించడం, ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ విలువలకు నీళ్ళొదిలేసి సమాజ దృష్టిని వేరేవైపుకి దారిమళ్లించడం.
ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులే జగన్ దగ్గర రాణించగలుగుతారు అంటూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన, వస్తున్నా, రావడానికి సిద్ధంగా ఉన్న నేతలు చెపుతున్న కారణాలు. అయితే ఎప్పటి నుంచో వైసీపీ లో ఉంటూ జగన్ కు అన్నిరకాలుగా అండగా నిలబడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి చాలాకాలంగా అధిష్టానం పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తన పట్ల అధిష్టాన వైఖరికి వ్యతిరేకంగా పరోక్షంగా మరోసారి జగన్ ప్రభుత్వం పై తన గళం విప్పారు.
విభజన సమయంలో కొన్ని నెలలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు బాలినేని. ఒంగోలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ రోశయ్యతో తనకున్న అనుభవాలను, ఇప్పటి అసెంబ్లీ లో జరుగుతున్న దారుణాలను వివరించారు. గత అసెంబ్లీలో ప్రజలకు అవసరమైన విషయాల మీద చర్చలు జరిగేవి, కానీ ఇప్పటి అసెంబ్లీ లో బూతులు తప్ప మరేం కనపడడం లేదు, వినపడడం లేదు అన్నారు.
రోశయ్య అసెంబ్లీ లో మాట్లాడుతుంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అనిపించేది కాదు. ఆయన హయాంలో మంత్రిగా పని చేయడం నా అదృష్టం. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. అన్ని చెడిపోయాయి అంటూ తన సొంత పార్టీ నేతల బూతుల భాగోతం బయటపెట్టారు బాలినేని. ఇన్నాళ్ళుగా ప్రతిపక్ష పార్టీలు వైసీపీ నేతల బూతుల చిట్టా విప్పుతుంటే వారి పై ఎదురుదాడి చేసే నాయకులు ఇప్పుడు బాలినేని వ్యాక్యలకు ఏం సమాధానము చెపుతారు.
అసెంబ్లీ లోకి బూతుల్ని, రాజకీయాలలోకి దాడుల్ని ప్రేరేపించి పేదలకు – పెత్తందారులకు యుద్ధం. మీరు సిద్ధమా… అంటూ ప్రవచనాలు వల్లెవేస్తున్న జగన్ బాలినేని వ్యాక్యలను ఖండించగలరా..? తన పార్టీ నేతలను బూతులు మాట్లాడకుండా కట్టడి చేయగలరా..? తన పార్టీలో పరిధి దాటి మాట్లాడుతున్న పది మంది నాయకులను కూడా అదుపు చేయలేని ముఖ్యమంత్రి సమాజాన్ని మంచి మార్గంలో ఎలా నడపగలరు..? అంటూ ప్రజాస్వామ్య వాదులు గొంతులు అరిగేలా గోషిస్తున్నారు. ఇలా బూతుల్ని, దాడుల్ని పోత్సాహిస్తూ మరో ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది.




